మాజీ భార్యను చంపి పారిపోతూ మృతి చెందిన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్
మహబూబ్ నగర్: ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. కొంత కాలానికి విడాకులు తీసుకొన్నారు. అయితే భరణం విషయంలో భార్య కోర్టుకు వెళ్ళింది. ఈ కేసు విషయమై కోర్టు నుండి మాజీ భార్యను తీసుకొస్తూ ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పింటించాడే భర్త. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో తాను మరణించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం చోటు చేసుకొంది.
క్షణికావేశంలో తొందరపడి తీసుకొన్న నిర్ణయాలతో జీవితాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. విడాకులు తీసుకొన్న భార్య, భర్తలు ఒకే ద్విచక్రవాహనంపై హైద్రాబాద్ కు వస్తూ ఘర్షణ పడి చనిపోయారు.
భార్యను చంపి తప్పించుకొనే క్రమంలో భయంతో భర్త నడిపిన ద్విచక్రవాహనం స్థంభానికి ఢీకొట్టడం వల్ల భర్త కూడ చనిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో భీమ్లానాయక్, విజయలక్ష్మి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది.
ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం కొల్లాపూర్ రంగయ్యబావి తండాకు చెందిన భీమ్లానాయక్ 15 ఏళ్ళ క్రితం తిమ్మాజీపేట మండలం పుల్లగిరి తండాకు చెందిన విజయలక్ష్మిని ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. కొంత కాలం పాటు వీరిద్దరి దాంపత్యంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. ఈ దంపతులకు సంతానం లేకపోవడం, భీమ్లానాయక్ కు ఉద్యోగం లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
విడాకులు తీసుకొన్న జంట
సంతానం లేకపోవడంతో పాటు భీమ్లానాయక్కు ఉద్యోగం లేకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. దీంతో ఈ దంపతులు విడిపోయారు. కోర్టు నుండి విడాకులు కూడ తీసుకొన్నారు. దీంతో ఇద్దరు వేర్వుగా నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి హైద్రాబాద్ లోని తన సోదరుడి వద్ద ఉంటుంది.
భీమ్లానాయక్కు కానిస్టేబుల్ ఉద్యోగం
భార్య విజయలక్ష్మితో విడాకులు తీసుకొన్న తర్వాత భీమ్లానాయక్కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది.బిఎస్ఎఫ్లో భీమ్లానాయక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.అయితే దీంతో విజయలక్ష్మి తనకు భరణం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు భీమ్లానాయక్ ను భరణం చెల్లించాలని ఆదేశించింది. అయితే రెండు నెలలుగా భీమ్లానాయక్ భరణం చెల్లించడం లేదు.దీంతో బాధితురాలు మరోసారి కోర్టును ఆశ్రయించింది. దరిమిలా వీరిద్దరూ కూడ శనివారం నాడు మహబూబ్ నగర్ కోర్టుకు హజరయ్యారు.
భార్యను చంపేసి, తాను చనిపోయిన భీమ్లానాయక్
శనివారం నాడు భార్య,భర్తలు కోర్టుకుహజరయ్యారు. హైద్రాబాద్ దింపుతానని భార్య విజయలక్ష్మిని తన ద్విచక్రవాహనంపై భీమ్లానాయక్ తీసుకెళ్ళాడు. అయితే రాజూపూర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద ఇద్దరు మద్యం తాగారు. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆ కోపంలో భీమ్లానాయక్ తన మాజీ భార్య విజయలక్ష్మిని హత్యచేశాడు. పెట్రోల్ పోసి శవాన్ని దగ్ధం చేశాడు. అయితే ఈ విషయం తెలుస్తోందనే భయంతో ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తూ ఆర్ సీ పూర్ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్థంభానికి ఢీకొట్టి అక్కడికక్కడే భీమ్లానాయక్ మృతి చెందాడు. అయితే అదే సమయంలో విజయలక్ష్మి తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. భీమ్లానాయక్ మృతదేహం వద్దే విజయలక్ష్మి పర్సు, ఫోన్ దొరకడంతో ఆమెను భీమ్లా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.