విదేశాలకు వెళ్లొచ్చేసరికి భూమి గాయబ్!: తన స్థలంలో బిల్డింగ్ చూసి షాక్
హైదరాబాద్: ఉద్యోగం నిమిత్తం సింగపూర్ వెళ్లి వచ్చేలోగా, ఆ వ్యక్తికి చెందిన స్థలాన్ని ఆక్రమించడంతో పాటు, ఫోర్జరీ దస్తావేజులు సృష్టించి దానిని అమ్మివేసిన సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఆ స్థలాన్ని అమ్మడమే కాదు, అక్కడ పెద్ద భవంతిని కూడా నిర్మించారు.
బాధితుడు వచ్చి చూసేసరికి తన స్థలంలో భవనం ఉండటంతో షాకయ్యాడు. బాధితుడు నేరెడ్మెట్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుల్లో ఓ రాజకీయ నాయకుడు కూడా ఉండటం గమనార్హం. సదరు నేత ఓ కార్పోరేటర్ భర్త అని తెలుస్తోంది. ఐదుగురి పైన కేసు నమోదయింది.
బాధితుడు కృపానందం వెల్లడించిన వివరాల మేరకు.. ఏకాంబరం యాభై ఏళ్ల క్రితం అంటే 1966లో 250 గజాల స్థలం కొనుగోలు చేశారు. వారికి కొడుకు కృపానందతో పాటు కూతురు ఉంది. కృపానంద ఉద్యోగం కోసం సింగపూర్కు వెళ్లారు. ఇటీవలె తిరిగి వచ్చారు.
తన స్థలం వద్దకు వెళ్లేసరికి అక్కడ బహుళ అంతస్తుల భవనం కనిపించింది. వెంటనే సొదరికి ఫోన్ చేయగా ఆమె తాను ఎవరికి అమ్మలేదని చెప్పింది. దీంతో కృపానంద సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆయనకు అసలు విషయం తెలిసింది. ఫోర్జరీ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫర్యాదు చేశారు.