ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయిన భర్త: చికిత్స పొందుతూ భార్య మృతి
వరంగల్: ఓ వైపు సంగారెడ్డి జిల్లాకు చెందిన రాములు... భార్య మృతదేహాన్ని 60 కిలోమీటర్లు తోపుడుబండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు సైతం తానొక్కడే నిర్వహించగా.. వరంగల్ జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధమైన ఘటన చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త వదిలివెళ్లిన ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
మహబూబ్నగర్కు చెందిన రాజు, జ్యోతి(30) దంపతులు. కొద్దిరోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలానికి వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం జ్యోతి అస్వస్థతకు గురవడంతో రాజు ఆమెను ఎంజీఎం వైద్యశాలలో చేర్పించాడు. గుర్తుతెలియని విష పదార్థం తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన వైద్యులు వైద్యశాలలో చేర్చుకొని చికిత్స ప్రారంభించారు.
కాగా, ఆస్పత్రిలో చేర్పించే సమయంలో ఉన్న భర్త తర్వాత పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. చికిత్స పొందుతూ జ్యోతి వైద్యశాలలో చేరిన కొద్దిసేపికే మరణించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. భర్త ఆచూకీ కోసం ధర్మసాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, శనివారం రాత్రి మార్చురీకి వచ్చి భార్య మృతదేహాన్ని చూసి వెళ్లినట్లు మార్చురీ సిబ్బంది చెబబుతున్నారు.
పోలీసులను తీసుకొచ్చి శవపరీక్ష పూర్తయ్యేలా చేస్తానని చెప్పి వెళ్లాడని.. ఇంతవరకు రాలేదని తెలిపారు. దీంతో నాలుగు రోజులుగా శవం మార్చురీలోనే ఉండిపోయింది. మృతదేహం నుంచి వాసన వస్తుండడంతో సోమవారం శవపరీక్ష నిర్వహించి మున్సిపాలిటీకి అప్పగిస్తామని కేఎంసీ సిబ్బంది తెలిపారు.