ఫ్యామిలీతో ఉన్నచోట సంధ్య ఫోటోతో మార్ఫింగ్: బాల్క సుమన్పై ఆరోపణలు వట్టివే
మంచిర్యాల: పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్పై వచ్చిన ఆరోపణల మీద మంచిర్యాల సీఐ మహేష్ శుక్రవారం మాట్లాడారు. సుమన్పై సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. బాల్క సుమన్ భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారన్నారు. సుమన్ భార్య స్థానంలో సంధ్య అనే మహిళ ఫోటోను జోడించి ప్రచారం చేశారన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవి మార్ఫింగ్ చేసిన చిత్రాలు మాత్రమేనని తెలిపారు.
బాల్క సుమన్ బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలపై 2018 ఫిబ్రవరి 6వ తేదీన కేసు నమోదు అయిందని తెలిపారు. ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి లబ్ధి పొందాలని ఎంపీ ఫ్యామిలీ ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారన్నారు. సంధ్య, విజేతలు పలువురిని బ్లాక్ మెయిల్ చేసి వేధించినట్లుగా విచారణలో తేలిందన్నారు. వీరిద్దరిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిపారు.
సంధ్య, విజేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
బాల్క సుమన్ వివాదంలో చిక్కుకున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. లైంగిక వేధింపులు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో రావడంతో సీఐ మహేష్ శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంపీపై ఆరోపణలకు గాను విజేత, సంధ్యలపై కేసు నమోదు చేశామన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాలనే మార్ఫింగ్ ఫోటోలు ఆన్లైన్లో సర్క్యులేట్ చేశారని తెలిపారు. సంధ్య, విజేతలపై ఐపీసీ 420, 292ఏ, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
ఏం జరిగిందంటే ఇదీ జరిగింది!
బంజారాహిల్స్లోని ఎంపీ ఫ్లాట్లోకి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వచ్చి దౌర్జన్యం చేశారని, తనను బెదిరించారని ఎంపీ సహాయకుడు సునీల్ గత నెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారని, మే 31న సాయంత్రం బంజారాహిల్స్ నందినగర్లోని ఎంపీ అపార్టుమెంటుకు వచ్చిన ఆ నలుగురు తనను నెట్టేసి బలవంతంగా ఇంట్లోకి జొరబడ్డారని, ఎంపీ కోసం ఇల్లంతా వెతికారని ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇదివరకు వచ్చి హెచ్చరించారని ఫిర్యాదు
లోపల ఎంపీ లేకపోవడంతో తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఎంపీ మంచిర్యాలకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించారని కూడా సునీల్ తెలిపినట్లు మీడియాలో వచ్చింది. దౌర్జన్యం చేసిన వారిని సంధ్య, విజేత, శంకర్, గోపాల్లుగా పేర్కొన్నారు. సునీల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంలో జర్నలిస్టులు మల్హోత్ర, సురభి నిర్మల్, న్యాయవాదులు వీఎస్ రావు, ఎంఎస్ రెడ్డిలు ప్రధానికి ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి.
మార్ఫింగ్ ఫోటోలు
సంధ్య, కొందరు మహిళలు ఎంపీ చేతిలో లైంగిక దోపిడీకి గురవుతున్నట్లుగా ఆరోపించారని పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇదంతా వట్టిదేనని, కేవలం మార్ఫింగ్ ఫోటోలతో బాల్క సుమన్ నుంచి లబ్ధి పొందే ప్రయత్నంగా తేలింది. ఆ ఫోటోలను చూసినా మార్ఫింగ్ ఫోటోలుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.