హైకోర్డుకు మధుకర్ రీపోస్టుమార్టం నివేదిక
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన మంథని మధుకర్ రీపోస్టుమార్టం నివేదికను ఫోరెన్సిక్ నిపుణులు నాలుగురోజుల క్రితం హైకోర్టుకు నివేదించినట్లు సమాచారం.
మధుకర్ మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉండటంతో వారు న్యాయమూర్తి, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించారు. నివేదికను హైకోర్టు జూన్ మొదటి వారంలో బహిర్గతం చేయనున్నట్లు సమాచారం.
కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు
నర్సంపేట: కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులంతా కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొనగోటి నవీన్రావు విజ్ఞప్తి చేశారు.నర్సంపేట మున్సిఫ్ కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి(సబ్)కోర్టును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కక్షిదారుల ముంగిట్లోకి న్యాయవ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో కొత్తగా కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నూతన కోర్టులను నెలకొల్పనున్నట్లు తెలిపారు. కేసుల పేరుకుపోవడం వల్ల కక్షిదారులకు సకాలంలో న్యాయం జరగడం లేదని, దీని వల్ల ప్రజల్లో అపనమ్మకం ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. లోక్ అదాలత్లను నిర్వహించి వాటిల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. స్థానిక సబ్ కోర్టు భవన నిర్మాణానికి నిధులున్నందున వెంటనే భవన నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు.
జిల్లా జడ్జీ తిరుమలాదేవి మాట్లాడుతూ.. నర్సంపేటలో సబ్ కోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు న్యాయ వ్యవస్థ ఎంతో అందుబాటులోకి వచ్చిందని వివరించారు. కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ మాట్లాడుతూ కోర్టు భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చొరవచూపుతానన్నారు.బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర్రెడ్డి, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జయాకర్ తదితరులు మాట్లాడారు.సబ్ కోర్టుకు ప్రస్తుతం ఇన్ఛార్జి న్యాయమూర్తిని నియమించారని, దీని వల్ల కేసులు నత్తనడకన నడిచే అవకాశమున్నందున కొత్త కోర్టును న్యాయమూర్తిని నియమించాలని కోరారు.
ఈసమావేశంలో వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, సంయుక్త కలెక్టర్ హరిత, స్థానిక మున్సిఫ్కోర్టు న్యాయమూర్తి సాకేత్మిత్రా, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీశ్వర్, జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తొలుత జస్టిస్ నవీన్రావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సబ్ కోర్టు ప్రారంభోత్సవం అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు స్థానిక కోర్టు ప్రాంగణంలోని ఉద్యానవనంలో మొక్కను నాటి నీళ్లు పోశారు. జిల్లా జడ్జి తిరుమలాదేవి, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ సుధీర్బాబుతో పాటు పలువురు అతిథులు ఆ మైదానంలో పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటారు.