బెంగళూరులో ఉద్యోగమన్నాడు.. కానీ?: భర్త మోసంపై ఓ భార్య ధర్నా..
హైదరాబాద్: పెళ్లై నెల రోజులు కూడా గడవకుండానే తనను దూరం పెట్టిన ఓ భర్తపై న్యాయం కోసం పోరాడుతోంది ఓ భార్య. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నట్టు అబద్దాలు చెప్పి.. హైదరాబాద్ లోనే ఉంటూ తనను దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపిస్తోంది. సంవత్సరం నుంచి తనను కాపురానికి తీసుకెళ్లట్లేదని, ఇకనైనా తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగింది.

స్వప్న-విజయ్ కుమార్..:
పాతబస్తీలోని ఆలియాబాద్కు చెందిన శంకర్, యమునల కుమార్తె స్వప్న ఆలియాస్ ఆసియా(28)కు 2015 డిసెంబర్ 4న పార్శిగుట్ట మున్సిపల్ కాలనీకి చెందిన విజయ్ కుమార్తో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రూ.5లక్షలు ఇచ్చారు. అయితే పెళ్లయిన రెండు నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.

వేరు కాపురం పెట్టినా..:
విభేదాలు తలెత్తడంతో కుటుంబ సభ్యుల సూచనమేరకు పార్శిగుట్టలోనే ఈ ఇద్దరు వేరు కాపురం పెట్టారు. అక్కడ కూడా విబేధాలు తగ్గలేదు సరికదా మరింత పెరిగాయి. భర్త విజయ్ కుమార్ చీటికి మాటికి తనను వేధించేవాడని స్వప్న చెబుతున్నారు. ఎలాగైనా తనకు విడాకులు ఇవ్వాలని పథకం వేశాడని అంటున్నారు.

బెంగళూరులో ఉద్యోగం అని చెప్పి..:
తనను వదిలించుకోవాలన్న ప్లాన్ లో భాగంగా.. కొత్త నాటకానికి తెరలేపాడని స్వప్న ఆరోపిస్తున్నారు. బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని, ముందు తాను వెళ్లి అక్కడంతా సెట్ అయ్యాక నిన్ను తీసుకెళ్తానని నమ్మించినట్టు స్వప్న తెలిపారు.
అయితే అదంతా వట్టి అబద్దమని, అతను హైదరాబాద్ లోనే ఉంటూ సంవత్సర కాలంగా తనను దూరం పెడుతున్నాడని స్వప్న ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పలుమార్లు స్వప్న పాతబస్తీలోని ఝాన్సీబజార్ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

భర్త ఇంటి ముందు ధర్నా:
పోలీసులను ఆశ్రయించడంతో.. స్వప్న-విజయ్ కుమార్ లకు వారు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే తనకు విడాకులు కావాల్సిందిగా విజయ్ కుమార్ కోర్టుకెక్కాడు.
కోర్టులో కేసు పరిష్కారానికి చాలా కాలం పట్టే అవకాశం ఉండటం.. తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో.. ఎలాగైనా భర్త ఇంటికే వెళ్లాలని స్వప్న నిశ్చయించుకుంది. హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ సహాయంతో సోమవారం రాత్రి నుంచి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.

విజయ్ కుమార్ ఏమంటున్నారు?:
తన భర్త కాపురానికి తీసుకెళ్లే వరకూ ఆందోళన కొనసాగిస్తానని స్వప్న చెబుతుండగా.. భార్యాభర్తల మధ్య విడాకుల గొడవ కోర్టులో కొనసాగుతుండగా ఆమె మా ఇంటి వద్దకు వచ్చి ధర్నా చేయడం తగదని విజయ్ కుమార్ అంటున్నారు. పెళ్లయ్యాక విభేదాలు వచ్చాయని, అందుకే విడాకులు కోరుతున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications