హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలగజేస్తున్నాయి. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో ఉన్న సిద్ధి వినాయక క్లాత్ షోరూమ్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో షోరూమ్ అంతటా వేగంగా వ్యాపించాయి. దుకాణంలో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో బట్టలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మంటలు ఎగిసిపడటంతో సమీప ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గంటల పాటు శ్రమించి అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రించారు. ఈ ఘటనలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం సమయంలో షోరూమ్లో ఉద్యోగులు లేదా కస్టమర్లు లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక కొన్ని నెలల ముందే జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో బొమ్మల దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో మొత్తం 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల విలువైన సామగ్రి తగలబడిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.












Click it and Unblock the Notifications