మేడారం మహాజాతర 2024: తెలంగాణా కుంభమేళాకు తేదీలు ఫిక్స్!!
తెలంగాణ కుంభమేళా గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు తేదీలను ఖరారు చేశారు సమ్మక్క సారలమ్మ పూజారులు . విగ్రహాలు లేని విశిష్ట జాతరగా గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది. కొండా కోనల్లో గిరిజన సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి బారులు తీరుతారు. ఎడ్ల బండ్ల నుండి హెలికాఫ్టర్ వరకు రవాణా సౌకర్యాలతో అటు ప్రాచీన సంస్కృతి , ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర ఆకట్టుకుంటుంది.

అటువంటి మేడారం జాతర 2024 వ సంవత్సరంలో జరిపేందుకు సమ్మక్క-సారలమ్మ పూజారులు తేదీలను ఖరారు చేశారు. మేడారం జాతర 2024 ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. మేడారం జాతరలో భాగంగా మాఘ శుద్ధ పంచమి నాడు ఫిబ్రవరి 14వ తేదీన బుధవారం మండ మెలిగే పండుగను నిర్వహించనున్నారు. అదే రోజు గుడి శుద్ధీకరణ చేయనున్నారు.
ఆపై ఫిబ్రవరి 21వ తేదీన మాఘ శుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గుడి మెలిగే పండుగను నిర్వహించనున్నారు. ఆపై ఫిబ్రవరి 21వ తేదీన సాయంత్రం 6 గంటల తరువాత బుధవారం కన్నేపల్లి నుంచి సారలమ్మ ఆగమనం ఉంటుందని, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి పగిడిద్దరాజు లు గద్దెలపైకి రానున్నారని సమ్మక్క సారలమ్మల పూజారులు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 22 గురువారం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 23 శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు అని, ఆపై ఫిబ్రవరి 24వ తేదీన వనదేవతలను సమ్మక్క-సారలమ్మల వన ప్రవేశం చేస్తారని వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీ మళ్లీ మాఘ శుద్ధ బహుళ పంచమి బుధవారం నాడు తిరుగు వారం పండుగను నిర్వహించనున్నట్టు పూజారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications