ఆ 20మంది ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ.. మంత్రి ఎర్రబెల్లి సంచలనం
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ రేపు జరగనున్న నేపథ్యంలో నేడు మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో నిర్వహించిన బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించి సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు పక్కా అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నప్పటికీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టిని ఒకసారిగా ఆకర్షించాయి.
ఆ ఎమ్మెల్యేలను మారిస్తే వంద సీట్లు గ్యారెంటీ
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు గ్యారెంటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని, కాకుంటే కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న 20 మంది ఎమ్మెల్యేలను మార్చాలని అలా మారిస్తే బీఆర్ఎస్ కు వంద సీట్లు రావడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? చర్చ
తన సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలతో ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో అనేక ప్రశ్నలకు, చర్చలకు కారణంగా మారాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? ఒకవేళ కొత్తవారికి అవకాశం కల్పిస్తే వారిని ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుందా? అలాంటి పరిస్థితి వస్తే సొంత పార్టీ నేతల నుంచి బీఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకత వ్యక్తం కాదా? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వాళ్ళను మార్చాలని, కొందరిపై వ్యతిరేకత వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి
ఒకపక్క బీజేపీ మిషన్ 90 అంటూ 90 స్థానాల్లో విజయం సాధించి విజయ కేతనాన్ని ఎగరవేయడానికి ప్రయత్నం చేస్తుంటే, మరొక పక్క బీఆర్ఎస్ కూడా 90 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చెబుతూనే 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మారిస్తే 100 సీట్లు సాధించడం సాధ్యమవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలతో ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఎవరికి పదవి గండం ఉంది? సీఎం కేసీఆర్ ఏమైనా ఆ దిశగా ఆలోచిస్తున్నారా వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.