మునుగోడు ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి తెలివి.. ఫోటో ఫ్రేములతో వినూత్నంగా మనవి!!
మునుగోడులో ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు మునుగోడు ఉప ఎన్నికలు కీలకం కావడంతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బరిలోకి దిగిన రాజకీయ పార్టీల నేతలు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది.
వినూత్న ప్రచారం సాగిస్తున్న మంత్రి ఎర్రబెల్లి
మునుగోడు ఉప ఎన్నికల్లో ఏవిధంగానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ మండలాలు, గ్రామాల వారీగా ఇన్చార్జిలను నియమించి ప్రచార పర్వాన్ని సాగిస్తుంది. ఇక నేరుగా మంత్రులు రంగంలోకి దిగి మునుగోడులో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా సాగుతుంది. అందరికంటే వినూత్నంగా ఆయన తన ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఓటర్లతో కలిసి గ్రూప్ ఫోటోలు.. ఇంటింటికీ ఫోటో ఫ్రేములు
చండూరు మున్సిపాలిటీకి ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ఆయన అదిరిపోయే ఆలోచన చేశారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రతి ఓటర్ కుటుంబంతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రూప్ ఫోటో దిగుతున్నారు. అనంతరం ఆ ఫోటోలను ప్రింట్ తీసి ఫ్రేమ్ కట్టించి మరీ కార్యకర్తలతో ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు.
ఫోటోలు దిగిన అభిమానం ఉంటుందని మంత్రి కొత్త ఐడియా
తమతో కలిసి మంత్రి ఫోటో దిగారు అన్న భావన, తమతో కలిసి పోయిన మంత్రి పైన అభిమానం ఓటర్లకు కలుగుతుందన్న ఉద్దేశంతో, అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఒక జ్ఞాపకంగా ఓటర్ల వద్ద తన ఫోటో ఉండిపోతుందన్న ఆలోచనతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓటర్ లతో కలిసి దిగిన మంత్రివర్యుల ఫోటో వాళ్ల ఇంట్లో ఉండటంతోపాటు, పార్టీకి మేలు జరుగుతుందన్న ఆలోచనతో ఎర్రబెల్లి చేస్తున్న ఈ పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది.
ఎర్రబెల్లి ప్రచారంపై ఆసక్తికర చర్చ
మొత్తానికి ఈ చర్యతో ఎర్రబెల్లి దయాకర్ రావా? మజాకానా అంటూ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో, ఎర్రబెల్లి ప్రచారంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక ఎర్రబెల్లి ఫోటో ఫ్రేముల పంపిణీపై ప్రత్యర్థి పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన క్రిందకు రాదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మునుగోడులో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రంజుగా మారుతుంది. నియోజకవర్గంలో కాక రేపుతుంది.