ప్రధాని మోదీపై టీఆర్ఎస్ నేతల కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు సీరియస్ గా స్పందించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రధాని.. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. ఎవరు ఎంత మభ్యపెట్టినా.. తెలంగాణ ప్రజలు వేరే వ్యక్తుల పాలనను కోరుకోవడం లేదని మంత్రి కమలాకర్ చెప్పుకొచ్చారు. దేశ సంపదను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ ముందుకే వెళ్తుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా అని మంత్రి గంగుల ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ ప్రతీ రంగంలో అగ్రబాగాన నిలిచిందని చెప్పారు. పాదయాత్రల పేరుతో కొందరు తెలంగాణలో రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేఏ పాల్ లాంటి వారు కోతి వేషాలు వేస్తున్నారంటూ మండి పడ్డారు. ముఖ్యమంత్రికి ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందలేదని..బీజేపీ నేతలు ముందు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే సమైక్య పాలన చూసి నష్టపోయామని.. మరోసారి తమకు అటువంటి పాలన అవసరం లేదని గంగుల స్పష్టం చేసారు.
పన్నులు కట్టేది తాము అయితే, వాటిని పంచేది గుజరాత్ కా అంటూ గంగుల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందనే అక్కసుతోనే ప్రధాని మోదీ..సీఎం కేసీఆర్ పై విషం కక్కుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. రామగుండంలో అసత్య ఆరోపణలు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసారని ఆరోపించారు. సింగరేణి కార్మకులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని పదే పదే కోరినా..ఎందుకు స్పందించలేదని సుమన్ ప్రశ్నించారు.