సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెడితే .. మీ కాలనీకే కంటి వెలుగు; మేడిన్ తెలంగాణా అద్దాలు!!
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ఖమ్మం టిఆర్ఎస్ ఆవిర్భావ సభ వేదికగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కంటి ఆరోగ్యం కోసం వందరోజుల పాటు కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు చేస్తామన్న హరీష్ రావు
ఇక నేడు అమీర్ పేట లో కంటి వెలుగు శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగ్గా మంత్రి హరీష్ రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రజల వద్దకు వెళ్లి సేవ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి హరీష్ రావు గతంలో 8 నెలల్లో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు వంద రోజుల్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు.

కంటివెలుగు వివరాలను వెల్లడించిన మంత్రి హరీష్ రావు
18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి వెలుగు పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వ సిబ్బంది శిబిరాలను ఏర్పాటు చేసి వందరోజులపాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ శిబిరాలలో కంటి పరీక్షలు చేసి, ప్రజలకు అవసరమైన మందులను, కళ్లద్దాలను ఉచితంగా ఇస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అవసరమైతే శస్త్ర చికిత్సలు కూడా చేస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హరీష్ రావు కోరారు.

సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెడితే కాలనీకే కంటి వెలుగు బృందాలు
ట్విట్టర్, ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెడితే కాలనీకే కంటి వెలుగు బృందాలు వస్తాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణలోని ప్రతి పథకం దేశానికి దిక్సూచి అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయని మంత్రి హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న ఖమ్మం సభలో పాల్గొన్న ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రి వారి వారి రాష్ట్రాలలోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినట్టుగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

మేడిన్ తెలంగాణా అద్దాలు ఈసారి కంటి వెలుగు ప్రత్యేకం
మేడిన్ తెలంగాణ అద్దాలు ఈసారి పంపిణీ చేయనున్నామని ఆనందం వ్యక్తం చేసిన మంత్రి, సంగారెడ్డి లోనే కంటి అద్దాలు తయారు కావడం ఈసారి ప్రత్యేకమని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 15వేల సిబ్బందిని సిద్ధం చేసామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని పేర్కొన్న మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కంటి వెలుగును ఉపయోగించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications