దొరికిపోయిన దొంగ రాజగోపాల్రెడ్డి; ఆ వీడియోలతో ఈసీ దగ్గరకు వెళ్తాం: మంత్రి జగదీష్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూటకో మాట మార్చటం కోమటిరెడ్డి బ్రదర్స్ నైజమని పేర్కొన్న మంత్రి జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి అమ్ముడు పోయిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతామని పేర్కొన్నారు.

తెలంగాణా ప్రభుత్వంపై కుట్రలో భాగంగా మునుగోడు ఉపఎన్నిక: మంత్రి జగదీష్ రెడ్డి
20 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకున్నట్టు రాజగోపాల్ రెడ్డి తానే స్వయంగా ఒప్పుకున్నారని, అందుకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉందని పేర్కొన్న మంత్రి జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా అమ్ముడుపోయారని తీవ్ర విమర్శలు చేశారు. దొరికిపోయిన దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ పేర్కొన్న మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికను తీసుకువచ్చారని ఆరోపించారు.

ఆరు సీట్లున్న పార్టీని వదిలి మూడు సీట్లున్న పార్టీలో చేరితే అభివృద్ధి సాధ్యం అవుతుందా?
ఆరు సీట్లు ఉన్న పార్టీని వదిలి మూడు సీట్లు ఉన్న పార్టీలో చేరితే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలో భాగంగా బీజేపీ తెచ్చిన ఎన్నిక ఈ ఎన్నిక అని పేర్కొన్న మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఎన్నికలలో ప్రజలు బిజెపికి తగిన బుద్ధి చెప్పి తీరుతారని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ఫార్మర్ గా, కోవర్టుగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కోసం పని చేశారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.

పరువు నష్టం దావా వేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్న మంత్రి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు పరువు నష్టం దావా వేస్తానని చెబుతున్నారని పేర్కొన్న మంత్రి, పరువు నష్టం దావా వేయండి. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ బయటకు వస్తాయి అంటూ పేర్కొన్నారు. అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల మీద మాట్లాడారని, ఆయనే నేరుగా తమకు వచ్చిన కాంట్రాక్టర్లను గురించి చెప్పారని అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరికలకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications