మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్ - ప్రాణాపాయంలో ఉన్నవారిని తన వాహనంలో: నెటిజెన్ల ప్రశంసలు..!!
ఆపదలో ఉన్న వారు సమాచారం ఇవ్వగానే స్పందించే మంత్రి కేటీఆర్..మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఏ సమయంలో తన సోషల్ మీడియా వేదిక ద్వారా సమస్యలు తెలుసుకుంటూ ఆపదలో ఉన్న వారికి కేటీఆర్ కావాల్సిన సాయం అందిస్తున్నారు. అందునా ప్రధానంగా వైద్య సేవలు కావాల్సిన వారి విషయంలో మాత్రం తక్షణం స్పందిస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజా జరిగిన ఘటనలో ఆయనే స్వయంగా ఆ ప్రాంతంలో ఉండి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడటంలో కీలకమయ్యారు.

రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి..
రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి బాసటగా నిలిచారు. హకీంపేట వద్ద మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గాయాలపాలై సాయం కోసం నిరీక్షిస్తున్నారు. అదే సమయంలో సిరిసిల్ల పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు బయలుదేరారు. రోడ్డు పైన దృశ్యాలను గమనించారు.. వెంటనే కాన్వాయ్ని ఆపి కిందికి దిగారు. విద్యార్థులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.. ఇక, రక్తమోడుతున్న ఆ విద్యార్థులను తన ఎస్కార్ట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి వైద్యులతోనూ ఆరా..
సమయానికి ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు నిలిపారు. ఆ తర్వాత ఆ విద్యార్థుల పరిస్థితిపై ఆస్పత్రిలో ఆరా తీశారు. వారిని ఆస్పత్రికి తరలించే సమయంలో నేరుగా ఆస్పత్రికి ఫోన్ చేసి వారి పరిస్థితిని వివరించారు. ఆ తరువాత కూడా వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేటీఆర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. కరోనా సమయంలో అనేక మంది తమకు ఆస్పత్రుల్లో బెడ్స్ లేవని.. మందులు కావాలని చేసిన ట్వీట్లకు వెంటనే స్పందించారు.
బాధితులకు అన్ని సమయాల్లోనూ స్పందిస్తూ
అర్ద్రరాత్రి సమయాల్లో బాధితుల సమాచారం రాగానే..దగ్గరలో ఉండే పార్టీ నేతలకు వారి సాయం చేయాలని సూచించిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఇక, విద్య - వైద్యం కోసం ఎంతో మంది సోషల్ మీడియా వేదిక ద్వారానే కేటీఆర్ సాయం కోరుతూ ఉంటారు. తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యపై కేటీఆర్ స్పందిస్తూనే ఉన్నారు. ఆ సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేయడం.. లేదా తన కార్యాలయానికి వచ్చి కలవమని చెప్పడం.. వారికి తగిన విధంగా సాయం అందేలా చేస్తుంటారు.

సోషల్ మీడియా వేదికగా భారీ ఫాలోయింగ్..
కరోనా సమయంలో ఏపీ నుంచి సైతం కొందరు తమకు ఆస్పత్రుల్లో బెడ్ దొరికేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఆ వెంటనే కేటీఆర్ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డికి వారి పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని ట్వీట్ చేసారు. దీనికి వెంటనే స్పందించిన గౌతమ్ రెడ్డి వారికి ఆస్పత్రిలో చేర్చించేలా చర్యలు తీసుకున్నారు. ఇక, తాజాగా పలువురు విద్యార్ధులకు కేటీఆర్ బాసటగా నిలిచారు. ఇక, తాజాగా ప్రాణాపాయం లో ఉన్న విద్యార్ధులకు సరైన సమయంలో అండగా నిలిచి వారి ప్రాణాలు కాపాడిన మంత్రి కేటీఆర్ ను నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.
Recommended Video

కాంగ్రెస్ ఎంపీ సైతం...
బుధవారం ఉదయం భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆదుకున్నారు. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్పై వెళ్తున్న కుటుంబ సభ్యులను ఓ కారు ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న వారు కిందపడిపోయారు. అదే సమయంలో అటువైపు వస్తోన్న కోమటి రెడ్డి క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి తన కాన్వాయ్లో ఆస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications