బీజేపీ రియల్ అజెండా అదే.. తెలంగాణాకు వచ్చి నేర్చుకోండని పీఎం మోడీకి కేటీఆర్ లేఖ
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2,3 తేదీలలో హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే బిజెపి ప్రముఖులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు హైదరాబాద్ బాట పట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్ననే రాష్ట్రానికి చేరుకొని సమావేశాల నిర్వహణలో బిజీ అయ్యారు. ఇక నేడు ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు. ఎప్పుడు బిజెపి అగ్రనాయకులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా, వారికి అనేక ప్రశ్నలు సంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసే మంత్రి కేటీఆర్, తాజాగా మోడీపైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోవాలని మోడీకి సూచన
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టార్గెట్ చేశారు. ప్రధాని మోడీకి లేఖ రాసిన మంత్రి కేటీఆర్ తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఆవో.. దేఖో.. సీఖో అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్ రాసిన లేఖలో పలు అంశాలను గురించి సూచించారు.
మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం: కేటీఆర్ ఫైర్
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్ సూచించారు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ అసలు సిద్ధాంతం విభజన అని అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు. పార్టీ డిఎన్ఎ లోనే విద్వేషాన్ని, సంకుచితత్వాన్ని నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే నని తెలుసు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం లేదు
అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలు, సుపరిపాలన విధానాలు, ప్రాధాన్యతలను తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న పీఎం మోడీ అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణాకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ గడ్డ నుండే నూతన ఆలోచన విధానానికి నాంది పలకండి
డబల్ ఇంజన్ తో ప్రజలకు ట్రబుల్ గా మారిన మీ రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలోని పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న మీరు అద్భుతమైన తెలంగాణ గడ్డ నుండే నూతన ఆలోచన విధానానికి నాంది పలకాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి పీఎం మోడీ ఆలోచన చేయాలని, బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా నూతన ఆరంభం వైపు అడుగులు వెయ్యాలని మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.