మనస్సున్న మరాణి అలివేలు: సీఎం సహాయనిధికి రూ.10 వేల విరాళం, పారిశుద్ద్య కార్మికురాలి ఉదారత...
కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వాలు ఆదాయాలు కూడా కోల్పోయాయి. అయితే కొందరు మనస్సున్న మరాజులు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. ఆ జాబితాలో ఓ మహారాణి చేరారు. కానీ ఆమె వ్యాపారవేత్తనో, పారిశ్రామిక వేత్తనే కాదు.. పారిశుద్ద్య కార్మికురాలు. కానీ మనసులో మాత్రం మరాణి అని నిరూపించుకున్నారు. తన నెల వేతనం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసి తన ఉదారతను చాటుకొన్నారు.
అలివేలు ఉదారత..
జీహెచ్ఎంసీలో అలివేలు అనే పారిశుద్ద్య కార్మికురాలు పనిచేస్తున్నారు. చార్మినార్ జోన్లోని మలక్ పేట సర్కిల్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవడం విశేషం. వైద్యులు రోగులకు చికిత్స అందిస్తుండగా.. పోలీసులు జనం బయటకి రాకుండా చూస్తున్నారు. ఇంట్లో ఉన్న చెత్తను కార్మికులు తీసుకెళ్లి.. పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోన్న క్రమంలో ఏదో ఒకటి చేయాలని అలివేలు అనుకొన్నారు.
రూ.10 వేల విరాళం..
తన నెల జీతం రూ10 వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని అనుకొన్నారు. వెంటనే విషయాన్ని తన శ్రీశైలం యాదవ్, పిల్లలతో చర్చించారు. వారు కూడా ఓకే చెప్పడంతో ఎలా అని ఆలోచించారు. ఈ లోపు శ్రీశైలం యాదవ్ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసి.. తన మొబైల్ నంబర్ రాశారు. తన భార్య నెల జీతం ఇవ్వాలనుకుంటుందని పేర్కొన్నారు. కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో మంగళవారం అలివేలు దంపతులు మంత్రి కేటీఆర్ను కలిసి.. చెక్ అందజేశారు.
Recommended Video
సంకల్పంతో..
తాను ఆరేళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నానని అలివేలు తెలిపారు. సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో తన నెల జీతం అందజేశానని పేర్కొన్నారు. అలివేలు చేసిన మంచి పనిని మంత్రి కేటీఆర్ అభినందించారు. నెటిజన్లు కూడా అలివేలును పొగడ్తల్లో ముంచెత్తారు. ఏదైనా సాయం కావాలంటే తనను సంప్రదించాలని అలివేలును కోరారు. తన కార్యాలయ సిబ్బందిని అడగాలని సజెస్ట్ చేశారు. తనవంతుగా సాయం చేద్దామనుకొని చేశామని.. హెల్ప్ అవసరం లేదు అని అలివేలు పేర్కొన్నారు.