కాంగ్రెస్ 6గ్యారెంటీలు అంటే 6నెలలకు ఒక సీఎం గ్యారెంటీ: మంత్రి కేటీఆర్ ఎద్దేవా!!
కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరో తెలియదని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. చిట్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నాయకులు టీవీల్లో బలిసి కొట్టుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బులతో మిడిసిపడుతున్నారని మండిపడ్డారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గోస పడ్డామని, మళ్లీ కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని అన్నారు. మూడోసారి కెసిఆర్ గెలిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. తెల్ల కార్డు ఉంటే కేసీఆర్ భీమా ఇస్తామని ప్రకటించారు.

రైతు కూలీలకు భీమా లేకున్నా కేసీఆర్ భీమా వస్తుందన్నారు . అన్నపూర్ణ స్కీం కింద పేదలకు సన్న బియ్యం ఇస్తామని వెల్లడించారు. ఆడపిల్లకు నెలకు 3000 రూపాయలు ఇస్తామని, డిసెంబర్ 3 తర్వాత రైతుబంధు 16 వేల రూపాయలు వస్తుందని, ఒక నకిరేకల్ లోనే రైతుబంధు కి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న చిరుమర్తి లింగయ్య ను గెలిపించాలని, ఆయన గెలిస్తే పాలిటెక్నిక్ కాలేజీ వస్తుందని తెలిపారు
చిట్యాల లో ఫ్లైఓవర్, బ్రాహ్మణ వెల్లంల పూర్తి కావాలంటే బి ఆర్ ఎస్ కు ఓటు వేయాలన్నారు. ఉదయ సముద్రం, పిల్లాయపల్లి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన ఆయన కాంగ్రెస్ కు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. 6 గ్యారెంటీలు అంటే ఆరు నెలలకు ఒక సీఎం గ్యారెంటీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదని పేర్కొన్న ఆయన ప్రచారం కోసం ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి లీడర్లు దిగుతున్నారు తెలంగాణలో లీడర్లు లేరా అంటూ ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బులు పంచితే వాటిని తీసుకొని బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు గంటలు కరెంట్ చాలు అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఇక అటువంటి కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా ఆలోచించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications