తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సస్ కేటీఆర్..!!
తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యల పైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వాగ్వాదం చోటు చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ వేళ మంత్రి కేటీఆర్ వర్సస్ అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంఐఎం ఫ్లోర లీడర్ అక్బరుద్దీన్ గతంలో హైదరాబాద్ పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. ఇప్పుడున్న స్థాయిలో అయినా అభివృద్ధి చేయాలని అక్బర్ డిమాండ్ చేసారు. హైదరాబాద్ నగరంలో నేరాలు పెరుగుతున్నాయని అక్బర్ వ్యాఖ్యానించారు. 70 శాతం సీసీ టీవీ కెమేరాలా నిర్వహణ సరిగ్గా లేదన్నారు. గతంలో టీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చిందని.. ఏం సాధించందని అక్బర్ ప్రశ్నించారు. దీంతో..ఎంఐఎం వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సభలో వాదోప వాదనలు మొదలయ్యాయి.
అక్బర్ తన ప్రసంగంలో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ప్రస్తావించారు. రైతు రుణ మాఫీ చేయాలని కోరారు. హైదరాబాద్ పాతబస్తీ లో మెట్రో పూర్తి చేయటం పైన ప్రశ్నించారు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని నిలదీసారు. కొత్త నగరం తరహాలోనే పాతబస్తీ నీ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసారు. ఇదే సమయంలో.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బిఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారని ..అమలు చేయాలని కోరారు. గతంలో టీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నొట్ల రద్దు..జీఎస్టీ అంశాల్లో మద్దతు వద్దని తాము సూచించామని అక్బర్ గుర్తు చేసారు. కానీ, అప్పుడు సీఎం కేసీఆర్ ఏమి కాదు...అంతా మంచి జరుగుతుందని చెప్పారని వివరించారు. తాము ప్రధానిని విమర్శిస్తే అలా అనటం సరికాదని కేసీఆర్ అన్న మాటలను అక్బర్ గుర్తు చేసారు.
అన్యాయం జరుగుతోందని మొదటి నుంచి మేము చెబితే సీఎం కాదన్నారని వివరించారు. బీజేపీకి మద్దతు ఇచ్చారని..రాష్ట్రానికి ఏం వచ్చిందని అక్బర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ గా జాతీయ పార్టీని పెట్టినందుకు అక్బర్ అభినందనలు చెప్పారు. అక్బర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్పందించారు. రెండు పార్టీలు మాత్రమే ఉండాలని కొందరు అనుకుంటారని వ్యాఖ్యానించారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదని చెప్పారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. సభా నాయకుడు బీఏసీ కి రాలేదని నిందా పూర్వకంగా మాట్లాడడం తగదని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీఏసీకి వెళ్లారని గుర్తు చేసారు. అక్బర్ రాకుండా నిందించడం భావ్యం కాదని చెప్పుకొచ్చారు. మంత్రులు అందుబాటులో లేరని అనడం భావ్యం కాదని అక్బర్ కు సూచించారు. అదే సమయంలో అసెంబ్లీ తక్కువ రోజులు అంటున్నారని.. గతంలో కోవిడ్ ను మర్చిపోయారంటూ చెప్పుకొచ్చారు.