రేషన్ కార్డు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు; శుభవార్తే కానీ...
తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి క్లారిటీ ఇచ్చిన రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా మరొక శుభవార్తను చెప్పారు. ఇంతకాలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని ప్రచారం జరిగిన నేపధ్యంలో ఈ విషయం పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
వీరికి ఇందిరమ్మ ఇళ్లిస్తాం
రేషన్ కార్డు లేకపోయినా సరే మొదట విడతలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో పేదలు, నిరుపేదలను విభాగాలుగా పరిశీలించి వారికి తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు.

రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ళకు రేషన్ కార్డు తప్పనిసరి
అయితే రెండవ విడత నుంచి మాత్రం రేషన్ కార్డునే ప్రమాణికంగా తీసుకొని ఇల్లు మంజూరు చేస్తామని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు. ఈ క్రమంలో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మొదటి విడతలో చేయబోమని రేషన్ కార్డు లేని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ
ఇక త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అయితే రేషన్ కార్డు మంజూరు చేసిన తర్వాత రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మాత్రం తప్పనిసరిగా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు . మొత్తంగా రేషన్ కార్డులు లేని నిరుపేదలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విషయం శుభవార్త అని చెప్పాలి.
పించన్ పైనా అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
ఇక ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రామాలలో వృద్ధాప్యంలో ఉన్నవారు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడానికి అర్హులను గుర్తించాలని కూడా అధికారులకు సూచించారు. విధులలో ఎవరు ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. విధులలో అలసత్వం వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వేటు వేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications