కేసీఆర్ కు గురుబలం ఉంటే ఏంటి? కవిత జైలుపాలైంది అందుకే!!
నేడు కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన, కవిత పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్నకు ఇచ్చిన మాటను తప్పారని అందుకే ఆమె జైలు పాలయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండగట్టు అంజన్న కోపం వల్లే కవిత జైలుకు
ఎమ్మెల్సీ కవిత కొండగట్టులో అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెడతామని చెప్పారని, మాటిచ్చి మాట తప్పారని, అందువల్లే కొండగట్టు అంజన్న కోపం వచ్చిందని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలు పాలయ్యారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ గెలవాలని ఆ దేవుడిని ప్రార్థించినట్టు చెప్పారు.

కేసీఆర్ గురుబలం .. పొన్నం కౌంటర్
ఇక ఇదే సమయంలో ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగోలేదని కెసిఆర్ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుందని, కెసిఆర్ కు గురు బలం ఉందని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆయన కెసిఆర్ కు గురుబలం ఉంటే, ప్రజాబలం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు తామిచ్చిన అన్ని హామీలు అమలు చేయాలంటే 17 ఎంపీ స్థానాల్లో గెలిపించాలని, ప్రజలంతా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఓట్లు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వారిద్దరికీ మంత్రి సవాల్
ఇక ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను, ఎంపీ బండి సంజయ్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. పదేళ్లు కరీంనగర్ ఎంపీలుగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. మేము ప్రజల కోసం ఏం చేశామో ప్రజలకు చెబుతామని, మీరు ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలంటూ సవాల్ విసిరారు.
బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి పొన్నం విమర్శలు
తాను హిందువునని చెప్పుకొని కెసిఆర్ కరీంనగర్లో గెలిచారని, కానీ హిందువుగా కరీంనగర్ కోసం ఏం చేస్తారో చెప్పాలన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి, కొండగట్టు అంజన్న ఆలయానికి బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కొండగట్టు ప్రమాదం జరిగితే కెసిఆర్ ఒక్కసారైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ తాము ప్రచారాన్ని మొదలుపెట్టామని, అధిష్టానం అన్ని ఆలోచనలు చేసి అభ్యర్థిని ప్రకటిస్తుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications