గిరిజనుల పట్ల బీజేపీ వైఖరి మారకుంటే ఆ పని చేస్తాం: మంత్రి సత్యవతిరాథోడ్ అల్టిమేటం
పార్లమెంట్ వేదికగా గిరిజన రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి అర్జున్ ముండా చేసిన ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున పెంచలేం అంటూ కేంద్రమంత్రి అర్జున్ ముండా చెప్పడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రోజుకో కొత్త సాకు చెప్తూ గిరిజన రిజర్వేషన్ల పెంపు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
బిజెపి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుంది
గిరిజన రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి 2015లో చెల్లప్ప కమిషన్ నివేదిక ఇచ్చిందని, 2016 లో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం పంపిందని మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తుచేశారు. బిజెపి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుందని మండిపడిన ఆమె, గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉండాలంటే తమిళనాడు తరహాలో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్ లో చేర్చాలని మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.
ఎప్పటికప్పుడు గిరిజన రిజర్వేషన్లపై కుంటి సాకులు
గతంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల తీర్మానం అందలేదని చెప్పిన కేంద్ర మంత్రులు ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపుతున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గిరిజనుల బతుకులు మారాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు. గిరిజనుల పట్ల బీజేపీ ధోరణి మారకుంటే ఆ పార్టీ నేతలు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదని మంత్రి సత్యవతి రాథోడ్ అల్టిమేటం జారీ చేశారు.
ఆదివాసీలను, బంజారాలను విడదీసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ
ఆదివాసీలను, బంజారా లను విడదీసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. రోడ్ల మీద అడ్డంగా తిరుగుతూ ఏది పడితే అది మాట్లాడే బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గిరిజన రిజర్వేషన్ల విషయంలో చేసింది ఏంటో చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ నిలదీశారు.
లంబాడాలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు దీక్షలకు పురిగొల్పుతున్నారని, దీనిపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు. గిరిజనుల బతుకులతో చెలగాటమాడుతున్న బిజెపికి బుద్ధి చెప్పాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.