రేషన్ బియ్యం దొడ్డిదారి పడుతుందన్న ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి .. అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటే
తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను బయటపెట్టారు. ప్రభుత్వం నిరుపేదల కోసం ఇస్తున్న రేషన్ బియ్యం ఎలా పక్కదారి పడుతున్నాయి అనేది పూసగుచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయని, చాలా మంది లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సభాముఖంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివరించారు .
సభా పర్వం ... ఐటీఐఆర్ పై రగడ ... తీర్మానం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టు
రేషన్ బియ్యం ప్రజలు తినటానికి ఇష్టపడటం లేదన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జోరుగా సాగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల దృష్ట్యా బియ్యం పంపిణీకి బదులుగా నగదు బదిలీ అమలు చేస్తే బాగుంటుందని ఆయన ప్రభుత్వానికి సూచించారు. రూ.5400 కోట్లు వెచ్చించి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తోందని కానీ ఆ బియ్యం ప్రజలు తినడం లేదని, అవి ప్రజలు తినడానికి ప్రజలు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.
బియ్యానికి బదులు నగదు జమ చెయ్యాలని కోరిన ఎమ్మెల్యే
బియ్యానికి బదులు గా ప్రజల ఖాతాల్లోనే డబ్బు జమ చేయడం మేలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్న విషయాన్ని, రీసైక్లింగ్ బాగా జరుగుతుంది అన్న విషయాన్ని ప్రస్తావించిన చల్లా ధర్మారెడ్డి పౌరసరఫరాల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని పేర్కొన్నారు. రేషన్ కార్డుతో ముడిపెట్టకుండా హెల్త్ కార్డులు ఇస్తే.. రేషన్ కార్డులకు డిమాండ్ తగ్గుతుందని చెప్పారు. అలాగే, కొత్త పంచాయతీలకు రేషన్ షాపులు మంజూరు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
నగదు బదిలీ ప్రతిపాదన లేదన్న మంత్రి గంగుల కమలాకర్
మంత్రి గంగుల కమలాకర్ సమాధానమిస్తూ నగదు బదిలీ ప్రతిపాదన తమ వద్ద లేదని, అలాంటి ఆలోచన ప్రస్తుతానికి చెయ్యటం లేదని పేర్కొన్నారు.రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి గంగుల కమలాకర్ పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతోనే 2.66 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. నిరుపేదల కోసమే పౌర సరఫరాల వ్యవస్థ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చెప్పిన విషయంతో బయటపడిన ప్రభుత్వ పనితీరు
మొత్తానికి రేషన్ బియ్యం తినకుండా ప్రజలు ఏం చేస్తున్నారో చెప్పిన ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరును పూస గుచ్చినట్టు వివరించారు. ఇంతా జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో వ్యక్తం అవుతుంది. రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు దొడ్డిదారిన రవాణా అవుతున్నాయని, ఇంతా జరుగుతున్నా తామేమీ చేయలేకపోతున్నామని , అందుకే నగదు బదిలీ పథకం తోటి రేషన్ దందాకు చెక్ పెట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యే సూచించడం గమనార్హం.