రేవంత్ రెడ్డిని ముందు పిలవండి, ఆ తర్వాత నేను: చిన్నారెడ్డి కామెంట్స్ పై జగ్గారెడ్డి తీవ్ర స్పందన
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగా వివరణ ఇచ్చానని కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు తెలియదని, ఇది మీడియాలో కూడా వచ్చిందని చెప్పారు. తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు జగ్గారెడ్డిని హాజరు కావాలనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగ్గారెడ్డి తీవ్ర స్పందన
ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి మీడియాకు వెల్లడించిన అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యకర్తలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలవాలని, అప్పుడు తాను కమిటీ ముందు హాజరవుతానని తేల్చి చెప్పారు. సోనియా గాంధీకి తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్ అయ్యిందో తెలియదని, ఈ విషయం మీడియా ద్వారా కూడా వివరణ ఇచ్చినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాడా? అంటూ జగ్గారెడ్డి
తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా. లేక మీడియాలో వచ్చిన వార్లను కమిటీ సుమోటోగా తీసుకున్నదా? అన్న విషయాన్ని చిన్నారెడ్డి మీడియా ముందు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించి పార్టీ లైన్ దాటిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలో పరిధిలోకి రాడా? అని జగ్గారెడ్డి నిలదీశారు. తన సొంత ఉమ్మడి జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా తనకు చెప్పకుండా కార్యక్రమం ప్రకటన చేస్తే అది క్రమశిక్షణ కిందకు రాదా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిని ముందు పిలవండి.. తర్వాత నేను వస్తా: తేల్చేసిన జగ్గారెడ్డి
వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జీగా తాను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఇవాళ పత్రికల్లో చూసినట్లు తెలిపారు. అయితే, తనకు సమాచారం ఇవ్వకపోవడం క్రమశిక్షణ కిందకు రాదా? అని ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రేవంత్ రెడ్డిని పిలిచిన తరువాతనే తీసుకోవాలన్న విషయం చిన్నారెడ్డికి తెలీదా? అని నిలదీశారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు రేవంత్ రెడ్డిని పిలిచిన తరవ్ాతనే తనను పిలిస్తే తప్పకుండా హాజరవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కాబట్టే తాను కూడా చిన్నారెడ్డికి మీడియా ద్వారానే జవాబిస్తున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత అజెండాను అమలు చేస్తున్నారని, పార్టీ నేతలకు కార్యక్రమాలపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని జగ్గారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.