గోవులను రక్షిస్తుంటే అక్రమ కేసులా?: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గో రక్షా పేరిట గోవులను రక్షిస్తుంటే పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేస్తానని రాజాసింగ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కాగా, మంగళవారం ఉదయం బషీర్బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ బయలుదేరడానికి వెళుతుండగా పోలీసులు రాజా సింగ్ను అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను, గోవు దూడలను వెంటనే గోశాలకు తరలించాలని అన్నారు. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చేవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తన వల్ల పార్టీకి నష్టం కలగకూడదంటూ ఇటీవల బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాను బీజేపీ ఇప్పటి వరకు ఆమోదించనట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications