గాంధీ వారసులపై గాడ్సే వారసుల వేధింపులు; బీజేపీ అనుబంధసంస్థగా ఈడీ: ఎమ్మెల్యే సీతక్క ఫైర్
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిపీసిసి కార్యవర్గం, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షులు తదితరులు పాల్గొంటున్నారు. సోనియాగాంధీ విచారణ పూర్తయ్యేవరకు టీ కాంగ్రెస్ నేతలు దీక్షను కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ఈ క్రమంలో దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రంలోని అధికార బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
బీజేపీ అనుబంధ సంస్థగా ఈడీ పని చేస్తుంది: ఎమ్మెల్యే సీతక్క
గాంధీభవన్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష మాట్లాడిన ములుగు ఎమ్మెల్యే సీతక్క తనదైన శైలిలో కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. బిజెపి నేతల పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సీతక్క గాంధీ వారసులను గాడ్సే వారసులు ఇబ్బంది పెడుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఈడీ కన్ను వేసిందని, ఇది కక్షసాధింపు చర్య తప్ప మరొకటి కాదని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బీజేపీ అనుబంధ సంస్థగా పని చేస్తుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతీ వస్తువుపై గబ్బర్ సింగ్ ట్యాక్స్ లు
దేశాన్ని దోచుకున్న దొంగల పట్ల ఈడీ అధికారులు కళ్ళు మూసుకున్నారు అని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియా ని దోచుకున్నట్టు ఇప్పుడు దేశాన్ని కొందరు దోచుకు తింటున్నారని సీతక్క మండిపడ్డారు. దేశంలో ప్రతి వస్తువు పై గబ్బర్ సింగ్ టాక్స్ వేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు చాలా ఫ్రెండ్లీ ఫైట్ చేస్తున్నాయని ఆరోపించిన సీతక్క, ఇరు పార్టీల డ్రామాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బిజెపి దానితో టిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని ఎమ్మెల్యే సీతక్క తేల్చిచెప్పారు.
నేడు ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సోనియా గాంధీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 21వ తేదీన తొలిసారిగా సోనియాగాంధీని విచారించిన ఈడీ అధికారులు మూడు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ఇరవై ఎనిమిది ప్రశ్నలకు సోనియాగాంధీ సమాధానమిచ్చారు. ఇక మళ్లీ నేడు కూడా ఈడీ అధికారులు సోనియాగాంధీని విచారిస్తున్నారు. సోనియా గాంధీపై ఈడీ అధికారుల విచారణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు నిర్వహిస్తోంది.