మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి; భక్తుల రద్దీతో కరోనా వ్యాప్తి
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు సమయం సమీపిస్తున్న కొద్దీ మేడారం జనసంద్రాన్ని తలపించింది. ఇప్పటికే లక్షలాదిగా ప్రజలు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మేడారంలో పారిశుద్ధ్యం పెద్ద సమస్యగా మారింది. ఇదే సమయంలో మేడారంలో భక్తుల రద్దీ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
మేడారం జాతరకు వచ్చే భక్తులకు సీతక్క విజ్ఞప్తి
ములుగు ఎమ్మెల్యే సీతక్క మేడారం జాతరకు తరలివస్తున్న భక్తులకు విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించిన తర్వాత కోళ్లు, మేకలు సహా ఇతర వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ అడవిలో చెట్ల మీద, గుడి ఆవరణలో పడవెయ్యవద్దని చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ పేర్కొన్నారు. వ్యర్ధాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల తర్వాత వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఈ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రజలు డెంగ్యూ ,కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. దయచేసి వ్యర్ధాలను చెత్తకుండీలో మాత్రమే వేయాలని పరిశుభ్రతను పాటించాలని, గిరిజన ప్రజలు వ్యాధుల బారిన పడకుండా సహకరించాలని ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు.
జాతర వద్ద ఫీవర్ సర్వే.. కరోనా లక్షణాలతో భక్తులు
ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటైన సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో తాజాగా 105 మంది వ్యక్తులకు కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు ఫీవర్ సర్వేలో తేలింది. జాతర స్థలంలో ఫిబ్రవరి 4 నుండి ఇప్పటి వరకు చాలామంది కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించారు . ఫిబ్రవరి 4 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2600 మందిని సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు.
మేడారం జాతరకు కరోనా టెన్షన్ ... వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన ఆరోగ్య శాఖ
గత ఏడు రోజుల్లో ఒక్క ములుగు జిల్లాలోనే 116 కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని గమనించిన ఆరోగ్య అధికారులు జాతరను సందర్శించే ప్రజలను పరీక్షించడానికి అనేక శిబిరాలను ఏర్పాటు చేశారు. తాము జాతర స్థలంలో మరియు చుట్టుపక్కల 35 శిబిరాలను ఏర్పాటు చేసామని , ఇక్కడ దుకాణదారులను మరియు జాతరను సందర్శించే భక్తులను పరీక్షిస్తున్నామని వైద్య ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. వరంగల్, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్ష చేయించుకునేందుకు వీలుగా జిల్లా ఎంట్రీ పాయింట్లలో 40 క్యాంపులను ఏర్పాటు చేశామని అని ములుగు డీఎంహెచ్వో డాక్టర్ అల్లం అప్పయ్య తెలిపారు.
Recommended Video
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ప్రస్తుతం జిల్లాలో 495 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఫీవర్ సర్వే కరోనా బాధితులు గుర్తించటానికి ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో, మాస్క్ ధరించడం ఖచ్చితమైనదని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కచ్చితంగా సామాజిక దూరం నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు చెబుతున్నారు.