రైతు సమస్యలపై కదం తొక్కిన సీతక్క .. ప్రగతిభవన్ ముట్టడి యత్నం .. ఉద్రిక్తత ..అరెస్ట్
రైతు సమస్యలపై ములుగు ఎమ్మెల్యే సీతక్క కదంతొక్కారు. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని, అన్నదాతల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించలేదని, పంటలకు పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం స్పందించటం లేదని ప్రభుత్వ తీరును నిరసిస్తూ ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ప్రయత్నించిన ఎమ్మెల్యే సీతక్క ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సీతక్క ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సీతక్క సాహసం .. గోదావరి ముంపు ఏజెన్సీ గ్రామాల్లో.. రాత్రనక, పగలనక ... వర్షంలో తడుస్తూ జనం కోసం
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈరోజు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. రైతు సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రస్తావనే లేదని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు సీతక్క. ఈ క్రమంలో కారు దిగిన సమయంలోనే ఓ మహిళా పోలీసు సీతక్క పై చేయి వేశారు. దీంతో సీతక్క అగ్గిమీద గుగ్గిలమయ్యారు. చెయ్యి ఎందుకు వేస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే సీతక్క కు మధ్య వాగ్వాదం జరిగింది. బలవంతంగా సీతక్కను లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు పోలీసులు .
తీవ్రమైన తోపులాట మధ్య ఎమ్మెల్యే సీతక్క ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తన పై చేయి వేసిన పోలీసులపై చెయ్యి తియ్య మంటూ గట్టిగా గద్దించారు సీతక్క. పోలీసులను పెట్టి ఎన్నిరోజులు ప్రతిపక్షాల నోరు నొక్కే ప్రయత్నం చేస్తారని ఆమె మండిపడ్డారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని సీతక్క తెలంగాణ ప్రభుత్వంపై దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చజరగలేదన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్కతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కిసాన్ సెల్ నేతలు పాల్గొన్నారు.
Recommended Video