ఎమ్మెల్యే సీతక్కకు తృటిలో తప్పిన పెను ప్రమాదం: వాగులో ఆగిపోయిన పడవ(వీడియో)
హైదరాబాద్: వరద బాధితులను పరామర్శించేందుకు, సాయం చేసేందుకు వెళ్లిన ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా సీతక్క ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్ అయిపోయింది. దీంతో పడవ వాగు మధ్యలో ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది.
అనంతరం వాగు ఉద్ధృతికి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.అప్రమత్తమైన అధికారులు సీతక్కను పడవలో నుంచి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సీతక్కతో పాటు పడవలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపెల్లి వాగులో చోటుచేసుకుంది. కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను సీతక్క పరామర్శిస్తున్నారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులను కూడా అందజేస్తున్నారు.

మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
మరోవైపు, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, తూర్పూ తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రటకనలో పేర్కొన్నారు.
శుక్రవారం ఒడిశా తీరం, పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం వాయువ్యవ బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన, సీఎం ఏరియల్ వ్యూ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్ధేరుతారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. గోదావరి వరద కారణంగా జిల్లాలో ఏర్పడిన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందులకు గవర్నర్ హాజరుకావాల్సి ఉండగా.. భద్రాచలం పర్యటన నేపథ్యంలో ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
Lucky that our boat got dashed to this tree and got out of boat safely, after distributing groceries to flood victims on the way back on boat we ran out of fuel and by the force of water our boat travelled some distance and dashed to tree. @RahulGandhi @manickamtagore #rains pic.twitter.com/qT0Zt6xZJk
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) July 16, 2022
ఇది ఇలావుండగా, వరద ప్రభావిత గోదావరి పరివాహక ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదలపై సమీక్షించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎం ఏరియల్ సర్వే కొనసాగనుంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సర్వేలో పాల్గొననున్నారు.