పువ్వు + కారు = పుకారు; పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఎమ్మెల్యే సీతక్క ఏమన్నారంటే!!
మునుగోడు ఉపఎన్నికలో కీలకమైన పోలింగ్ కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పై దుష్ప్రచారం జరుగుతుంది. పాల్వాయి స్రవంతి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారని, ఆమె డబ్బులకు అమ్ముడుపోయారని మార్ఫింగ్ చేసిన ఫోటోలతో జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. కావాలని కాంగ్రెస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడించాలని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పాల్వాయి స్రవంతి పై దుష్ప్రచారంపై మండిపడిన ఎమ్మెల్యే సీతక్క
ఇప్పటికే టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫేక్ పార్టీ బిజెపి అంటూ టార్గెట్ చేసి, గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలో చేసినట్టే ఇప్పుడు కూడా బీజేపీ నేతలు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తాజాగా ఎమ్మెల్యే సీతక్క కూడా బీజేపీ శ్రేణులు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడులో పోటీలో ఉన్న ఆడబిడ్డను ప్రతి ఒక్కరు ఆదరించాలని, బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ భారత జూడో యాత్రలో పాల్గొన్న సీతక్క ఈ మేరకు మునుగోడు ప్రజలనుద్దేశించి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

మునుగోడులో కాంగ్రెస్ పై ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీతక్క విజ్ఞప్తి
అందులో సీతక్క పువ్వు+ కారు = పుకారు అంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పైన దుబ్బాకలో పోలింగ్ రోజునే బీజేపీ చేసిన దుష్ప్రచారం, ఇప్పుడు మళ్లీ మునుగోడులో అలాగే ఫేక్ ప్రచారం సాగిస్తుందని ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిందని బీజేపీ దుర్మార్గమైన ప్రచారాన్ని చేస్తుందని, ఇక ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన సీతక్క, కావాలని కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు దిగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
మునుగోడు ప్రజల కష్టాలు తీర్చే సత్తా ఆడబిడ్డ పాల్వాయి స్రవంతికి ఉందన్న సీతక్క
మునుగోడులో ఓడిపోతామనే భయం ఉన్నవారు కాంగ్రెస్ పార్టీపై ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. మునుగోడు ప్రజల కష్టాలను తీర్చే సత్తా పాల్వాయి స్రవంతి కి ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే సీతక్క, ఓటర్లు ఈ విష ప్రచారాన్ని తిప్పి కొట్టేలా ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. ఇక తనపై జరుగుతున్న ప్రచారం పైన పాల్వాయి స్రవంతి సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను సీఎం కేసీఆర్ ను కలవలేదని పాల్వాయి స్రవంతి స్పష్టం చేశారు. దీనిపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications