టీఆర్ఎస్ కౌన్సిలర్ హత్యలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తం? పోలీసులు ఏం చెప్పారంటే!!
మహబూబాద్ పట్టణంలో బాబు నాయక్ తండాకు చెందిన 8వ వార్డు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బానోతు రవి నాయక్ హత్య రాజకీయ రంగు పులుముకుంది. బానోతు రవి నాయక్ హత్య వెనుక ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తముందని, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అనుచరులతో రవి నాయక్ ను హత్య చేయించారని రవి నాయక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మహబూబాబాద్ లో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ కౌన్సిలర్ హత్య
మహబూబాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవి నాయక్ పట్టణంలోని పత్తిపాక వద్ద నూతనంగా నిర్మించిన ఇంటిని సందర్శించడానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో కొందరు దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. పట్టణం నడిబొడ్డున పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. తనకు ప్రాణహాని ఉందని పదేపదే సన్నిహితుల వద్ద చెప్పిన రవి నాయక్ చివరకు దారుణ హత్యకు గురయ్యారు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తం ఉందని ఆరోపణ
మానుకోటలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల కోసం గిరిజన రైతులకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకున్న క్రమంలో దీనికి వ్యతిరేకంగా బాధిత గిరిజన రైతుల పక్షాన కౌన్సిలర్ బానోతు రవి నాయక్ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. గిరిజన మహిళలతో కలిసి పట్టణంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో రవి నాయక్ రాజకీయంగా ఎదగడం ఓర్చుకోలేక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ దారుణానికి ఒడిగట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రవి నాయక్ మృతికి కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు.

రాజకీయంగా ఎదుగుదల ఓర్చుకోలేక హత్య... శంకర్ నాయక్ ను అడ్డుకున్న కుటుంబ సభ్యులు
తన భర్త బానోతు రవి నాయక్ ఇండిపెండెంట్ గా గెలిచారని, ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారని, రాజకీయంగా ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన అనుచరులతో హత్య చేయించారని రవి నాయక్ తల్లి లక్ష్మి, భార్య పూజ ఆరోపించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టం చేస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటుగా పలువురు నాయకులను మృతుల బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వల్ల ఈ దారుణం జరిగిందని వారు ఆరోపించారు.

ఎమ్మెల్యే హత్యకు కారణం అన్న కుటుంబం .. భూ తగాదాలే కారణమన్న పోలీసులు
మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు ఆసుపత్రికి చేరుకుని హత్యకు గల కారణాలను ఆరా తీశారు. దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు ఇప్పటికే మహబూబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అయితే టిఆర్ఎస్ కౌన్సిలర్ హత్యకు ఎమ్మెల్యే కారణమని కుటుంబీకులు చెబుతుంటే, భూ తగాదాలే కారణమని పోలీసులు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications