ఎమ్మెల్యేలకు ఎర కేసు: పోలీసుల దర్యాప్తుపై అప్పటిదాకా హైకోర్టు స్టే; ఒకేకేసులో భిన్నతీర్పులు!!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బిజెపి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసు దర్యాప్తుపై మునుగోడు ఉప ఎన్నిక ముగిసేవరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. బిజెపి దాఖలు చేసిన పిటిషన్ పై ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

బీజేపీ పిటీషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం.. వాదన సాగిందిలా
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం తో విచారణ చేయించాలని కోరుతూ బిజెపి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలంగాణ బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా ధర్మాసనం దీనిని విచారించింది. ఈ కేసును సీబీఐ లేదా జ్యూడిషియల్ విచారణకు ఆదేశించాలని కోరిన బీజేపి బీజేపీని బదనాం చేసే కుట్ర జరుగుతోందని బిజెపి తరపున లాయర్ వాదనలు వినిపించారు.ఆధారాల్లేకుండా బీజేపీ పేరును పదేపదే ఎందుకు లాగుతున్నారని, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసి మునుగోడు ఎన్నికపై ప్రభావం చూపేలా కుట్ర జరుగుతోందన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదన విన్న ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు వెల్లడించింది.

పోలీసుల విచారణపై తాత్కాలిక స్టే విధించిన కోర్టు
అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారంపై పోలీసులు కొనసాగిస్తున్న విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 4కు వాయిదా వేసింది. పిటిషనర్ కోరినట్లుగా ఈ కేసును సీబీఐకి ఇవ్వాలా? న్యాయ విచారణకు ఆదేశించాలా? లేక తెలంగాణ పోలీసులు చేస్తున్న విచారణను కొనసాగించాలా? అనే అంశంపై ఆరోజు విచారణ జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగా నవంబర్ 4న జరిగే విచారణ నాటికి ఈ కేసుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వడంతోపాటు తగిన ఆధారాలను జతపర్చాలని పోలీస్ శాఖను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఒకే కేసుకు సంబంధించి రెండు వేర్వేరు పిటీషన్లు.. భిన్నతీర్పులు ఇచ్చిన హైకోర్టు బెంచ్ లు
ఇదిలా ఉంటే సైబరాబాద్ పోలీసులు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ముగ్గురు నిందితులను రిమాండ్ కు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఒక బీజేపీ వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో భాగంగా దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. ఒకే కేసుకు సంబంధించిన రెండు వేరు వేరు పిటిషన్లపై రెండు వేరు వేరు తీర్పులను ఇచ్చిన హైకోర్టు బెంచ్ ల తీర్పులపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications