సీఎం సొంత నియోజకవర్గంపై టీజీఎస్ఆర్టీసీ ఫోకస్.. బస్టాండ్ విత్ షాపింగ్ మాల్!
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ అభివృద్ధికి ఇప్పటికే వేల కోట్ల నిధులు కేటాయించి పనులు చేస్తున్నారు. కొండగల్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గం పైన టీజీఎస్ ఆర్టీసీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది.
కొడంగల్ లో కొత్త బస్టాండ్ ఏర్పాటుకు నిర్ణయం
వికారాబాద్ జిల్లా కొడంగల్లోని బస్ స్టేషన్ను ఆధునీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. కొడంగల్ లో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త బస్టాండ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొడంగల్ లో ప్రస్తుత బస్ స్టాండ్ను పూర్తిగా రూపురేఖలు మార్చి ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త స్టేషన్గా తీర్చిదిద్దనున్నారు.

కొత్త బస్ స్టేషన్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు
టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఇటీవల కొడంగల్లో పర్యటించి బస్ స్టేషన్ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్ స్టాండ్ చాలా డౌన్ లో ఉండటం, ప్రస్తుత సౌకర్యాలు సరిపోకపోవడం, రద్దీ ఎక్కువగా ఉండటం వంటి అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త బస్ స్టేషన్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మూడు కొత్త బస్ స్టేషన్ ల నమూనాలను రూపొందిస్తున్న అధికారులు
కొడంగల్ ప్రాంతం నుంచి హైదరాబాద్, మహబూబ్నగర్, తాండూరు, వికారాబాద్ తదితర ప్రాంతాలకు బస్సు సేవలు కొనసాగుతున్నాయి. ఈ మార్గాలలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆధునిక సౌకర్యాలు అవసరమని, సరైన మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బస్ స్టేషన్ అధునాతనంగా ఉండేలా నిర్మించనున్నారు. దీనికోసం మూడు కొత్త బస్ స్టేషన్ ల నమూనాలను అధికారులు రూపొందిస్తున్నారు.
కొడంగల్ బస్ స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణ సౌకర్యాల మెరుగుదల
కొత్త బస్ స్టేషన్లో వేచి ఉండే ప్రాంతాలు, టాయిలెట్ సౌకర్యాలు, తాగునీరు, సీటింగ్ వ్యవస్థలు, షాపింగ్ సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే ఆమోదం పొందే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఈ అభివృద్ధికి స్వాగతం పలుకుతున్నారు. కొడంగల్ బస్ స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడి స్థానికులకు ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications