మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పైసా వసూల్.. విషయం తెలిసి మంత్రి షాక్!!
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. వీళ్లు వాళ్ళు అన్న తేడా లేకుండా సైబర్ నేరాలకు పాల్పడుతూ పట్టుకోండి చూద్దాం అంటూ అధికారులతో ఆటలు ఆడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులను, ఎమ్మెల్యేలను ఇప్పటివరకు టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు, తాజాగా మంత్రులను సైతం ముప్పతిప్పలు పెడుతున్నారు. మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. వాళ్ల పేరు తోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పైసా వసూల్ మొదలుపెట్టారు.
జనాల నుండి డబ్బులు దోచుకోవడం కోసం సైబర్ నేరగాళ్లు మంత్రులను సైతం వాడుకుంటున్నారు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా, అవతలి వ్యక్తి నుండి డబ్బు దోచుకుంటున్నారు. తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేరును ఉపయోగించుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసింది. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ నంబర్లు, నకిలీ డీపీలు పెట్టి మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో ఆయన సన్నిహితులు కొందరికి వాట్సాప్ మెసేజ్ లు పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆయన పేరుతో మెసేజ్లు పంపి డబ్బులు కావాలని అడిగితే నిజమేనని నమ్మి పంపిన వాళ్లు కూడా ఉన్నారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి తన పేరుతో వచ్చే వాట్సాప్ సందేశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని, ఆ మెసేజ్ లకు స్పందించ వద్దని సూచించారు. నకిలీ నెంబర్లు, డీజీపీలతో సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారని, తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక తన పేరుతో వచ్చే సందేశాలపై ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు స్పందించకూడదు అని ఆయన సూచించారు.
ముఖ్యంగా ఆయన పేరుమీద సైబర్ నేరగాళ్ళు వాడుతున్న 9353849489 నంబర్ నుండి ఎటువంటి మెసేజ్ వచ్చినా స్పందించ వద్దని, పొరపాటున కూడా ఎవరు వారు అడిగిన డబ్బులు పంపించవద్దని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తనకు ఎవరినీ డబ్బులు అడగాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సూచించిన ఆయన, సైబర్ నేరగాళ్ల పై చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.