జగన్ కోసమే హైకోర్టు విభజనను చంద్రబాబు అడ్డుకుంటున్నారా?
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా హైకోర్టు విభజన జరగకపోవడంపై ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఉండాలని టిఆర్ఎస్ ఎంపీలు పలుమార్లు లోకసభలో తమ గొంతును బలంగా వినిపించారు.
హైకోర్టుకు విభజనకు సానుకూలంగా ఉన్నామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అయితే, హైకోర్టు విభజనకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని టిఆర్ఎస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్నా హైకోర్టు విభజన జరగకపోవడంపై టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు విభజన జరక్కపోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందన్నారు. హైకోర్టు విభజన జరిగితే జగన్ ఆస్తుల కేసులన్నీ తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పుడు జగన్ కేసుల్లో జోక్యం చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్క శాతం కూడా ఉండదని తెలిపారు.
జగన్ కేసులన్నీ తెలంగాణ న్యాయశాఖ పరిధిలోకి వస్తాయని, అప్పుడు జగన్ కేసులపై ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఉండదని తెలిపారు. ఇలా జగన్ ఆస్తులపై పట్టుకోవడం ఇష్టం లేకనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని వినోద్ ఆరోపించారు. జగన్ కేసులపై తాను పట్టుకోల్పోకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు కుట్రపూరితంగానే అడ్డుపడుతున్నారుని మండిపడ్డారు.
ప్రస్తుతం హైకోర్టులో 49మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా కేవలం 23మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఆ 23మందిలోనూ తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు కేవలం నలుగురే ఉన్నారని, అందులో ఒకరు ఇటీవలే రిటైర్ అయ్యారని తెలిపారు. మరొకరు ఈ నెలఖరులోగా రిటైరవుతారని చెప్పారు.
ఖాళీగా ఉన్న 17పోస్టుల్లో 11 పోస్టులను తెలంగాణ వారితోనే భర్తీ చేయాలని వినోద్ కోరారు. వీలైనంత త్వరగా హైకోర్టు విభజన చేయాలని ఎంపీ వినోద్ కుమార్, ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు.