విధ్వంసం: బాబుకి హెచ్చరిక, 12చోట్ల దాడులని తెరాస
వరంగల్ జిల్లాలోని హన్మకొండలో ఏర్పాటైన టీడీపీ వేదికకు నిప్పు పెట్టింది తామేనని ఎమ్మార్పీఎస్ గురువారం ప్రకటించింది. అంతేకాకుండా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వరంగల్ చేరేలోగా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించింది. వరంగల్ జిల్లా టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడం, అక్కడ ఉన్న ఫ్లెక్సీలు దగ్ధం చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో అడుగుపెట్టేలోగా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబును అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎన్ని కష్టాలొచ్చినా అండగా ఉంటా: చంద్రబాబు
వరంగల్ పర్యటనలో భాగంగా చంద్రబాబు భువనగిరిలో మాట్లాడారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాననిచెప్పారు. కార్యకర్తల త్యాగాలను మరిచిపోనని తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. ఎస్సెల్బీసీ పూర్తి చేసిన ఘతన టీడీపీదే అన్నారు.
దారిపొడువునా టీడీపీ శ్రేణుల భారీ ఏర్పాట్లు
చంద్రబాబు గురువారం ఉదయం ప్రత్యేక బస్సులో వరంగల్ జిల్లాకు బయలుదేరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మొదటిసారి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు వెంట భారీ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. చంద్రబాబు పర్యటన కోసం టీడీపీ శ్రేణులు దారిపొడువునా భారీ ఏర్పాట్లు చేశాయి. ఉప్పల్, భువనగిరి, ఆలేరు, వరంగల్, కాజీపేట మీదుగా బాబు హన్మకొండ చేరుకోనున్నారు.
సంక్షోభాలు టీడీపీకి కొత్తకాదు: కృష్ణయాదవ్
తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పాటుపడతామని టీడీపీ సీనియర్ నేత కృష్ణయాదవ్ అన్నారు. సంక్షభాలు పార్టీకి కొత్తగాదని, అన్నింటినీ అధిగమించి ముందుకెళ్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో అడుగుపెడుతున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడిని ఖండించిన తెరాస
చంద్రబాబు వరంగల్ పర్యటన సందర్బంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పైన తెలుగు తమ్ముళ్ల దాడిని తెరాస ఖండించింది. ఆ పార్టీ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉప్పల్ నుండి వరంగల్ వరకు పన్నెండు చోట్ల ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పైన దాడులు జరిగాయన్నారు. ఈ ఘటనలకు చంద్రబాబు, ఎర్రబెల్లిలు బాధ్యత వహించాలన్నారు. వర్గీకరణ పైన చంద్రబాబు స్పష్టత ఇవ్వాలన్నారు.