మునుగోడులో ద్విముఖ పోరేనా? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ!!
మునుగోడు ఉప ఎన్నికల పోరులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పోరు మునుగోడు ఉపఎన్నిక సాక్షిగా బయటకు వస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహార శైలి పార్టీ శ్రేణులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. మునుగోడు ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో కొత్త చర్చకు కారణంగా మారింది.
సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్ అగచాట్లు
మునుగోడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మునుగోడు ఎమ్మెల్యే గా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ నానా అగచాట్లు పడుతోంది. కాంగ్రెస్ పార్టీకి మునుగోడులో క్షేత్రస్థాయిలో పట్టు ఉన్నప్పటికీ, నల్గొండ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయకపోవడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో, వీడియో కలకలం
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులను నిరాశకు గురి చేసింది. ఇక ఇదే సమయంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడులో బీజేపీ అభ్యర్థి తన సోదరుడు అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వెయ్యాలని కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి మరీ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆపై తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, ఓడిపోయే కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు ప్రచారం చేయాలని చేసిన వ్యాఖ్యలు మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గందరగోళంలో పడేశాయి.
నిన్నటి వరకు త్రిముఖపోరు.. కోమటి రెడ్డి వ్యాఖ్యలతో ద్విముఖ పోరే అని చర్చ
నిన్నటి వరకు మునుగోడులో త్రిముఖ పోరు కొనసాగుతుందని అందరూ భావించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మునుగోడులో ఓడిపోతుందని కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మునుగోడులో ద్విముఖ పోరు మాత్రమే ఉంటుందని స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మునుగోడులో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పోటీ ఉంటుందని చర్చిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రత్యర్ధి పార్టీలకు బలం ఇస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపించుకోవటం కోసం నాయకులు పనిచేయని తీరు, నామమాత్రంగా జరుగుతున్న ప్రచారం, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇస్తున్న షాకులు వెరసి మునుగోడు ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రశ్నార్థకంగా మారింది.
మునుగోడులో కాంగ్రెస్ స్థానాన్ని పాతాళానికి పడేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి మునుగోడులో గట్టిపట్టు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఎదురీదేలా చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చూపించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు మునుగోడు నియోజకవర్గంలో చర్చనీయాంశం అవుతుంది. పార్టీ కోసం అందరు నాయకులు కలిసి కీలకంగా పనిచేసి మునుగోడులో మళ్లీ తమ స్థానాన్ని దక్కించుకోవచ్చునని క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ సమన్వయం లేకపోవడం కార్యకర్తలను సైతం నిరాశకు గురిచేస్తుంది. ఏది ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో, వీడియో రేపిన కలకలం మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ స్థానాన్ని పాతాళానికి పడేసింది.