చంద్రబాబు పాచిక - మునుగోడు బరిలో టీడీపీ - ఆ నేత కోసం బీఫాం సిద్ధం?
నల్లగొండ: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం కసరత్తు చేస్తోన్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ఆయా పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. విజయం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. పార్టీలు, అభ్యర్థుల మధ్య పరస్పరం ఆరోపణలు-ప్రత్యారోపణలు తీవ్రతరం అయ్యాయి. నల్లగొండ: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం కసరత్తు చేస్తోన్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ఆయా పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. విజయం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. పార్టీలు, అభ్యర్థుల మధ్య పరస్పరం ఆరోపణలు-ప్రత్యారోపణలు తీవ్రతరం అయ్యాయి.

అభ్యర్థులు రెడీ..
ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం వల్ల ఉప ఎన్నిక అవసరమైంది. రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ నుంచి ఉప ఎన్నిక బరిలో నిలవడం ఖాయమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేస్తోన్నారు. టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఈ ఉప ఎన్నిక బరిలో దింపింది. 2014 ఎన్నికల్లో కూసుకుంట్ల ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018 నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.

6న పోలింగ్..
తన స్థానాన్ని తాను తిరిగి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్, దీన్ని సొంతం చేసుకోవడానికి టీఆర్ఎస్, బీజేపీ కసరత్తు చేస్తోన్నాయి. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. 6వ తేదీన కౌంటింగ్ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. మునుగోడుతో పాటు మహారాష్ట్ర-అంధేరి ఈస్ట్, బిహార్-మొక్మా, గోపాల్ గంజ్, హర్యానా-ఆదంపూర్, ఉత్తర ప్రదేశ్-గోలా గోక్రనాథ్, ఒడిశా-ధామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నికను నిర్వహించడానికి ఈసీ ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆ నేతతో సంప్రదింపులు..
కాగా- మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. దీనికోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పార్టీ నాయకులతో మంతనాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఇతర సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం. టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కుతుందని, ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్తో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

బీఫాం కూడా..
బూర నర్సయ్య గౌడ్కు బీఫాం అందజేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చంద్రబాబు పూర్తి చేశారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉప ఎన్నిక అవకాశాన్ని వదులుకోకూడదని ఆయన భావిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి, విజయం సాధించడం ద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ బీసీ నేత కావడం.. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అగ్రవర్ణాలకు టికెట్లను ఇవ్వడం కలసొస్తుందనేది చంద్రబాబు అంచనా.

ఉనికిలో లేకుండా..
ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికి పెద్దగా లేదు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓటమిని చవి చూసిందా పార్టీ. టీడీపీ కీలక నేతలందరూ వలస వెళ్లారు. రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, నామా నాగేశ్వర రావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద వంటి నాయకులు టీడీపీని వీడారు. వేర్వేరు పార్టీలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో బూర నర్సయ్య గౌడ్ వంటి పేరున్న నాయకుడిని పార్టీలోకి చేర్చుకోగలిగితే బాగుంటుందని చంద్రబాబు ఆశిస్తోన్నారు.












Click it and Unblock the Notifications