మునుగోడు ఉపఎన్నిక... టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి సామర్ధ్యానికి పరీక్ష; సక్సెస్ అవుతారా?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మునుగోడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు లో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు కైవసం చేసుకోవడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగితే మునుగోడు లో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేపీ శ్రేణులు ధీమాతో ఉంటే, స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం నేపథ్యంలో మళ్లీ మునుగోడులో కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టి మునుగోడు ను టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మునుగోడులో జగదీశ్ రెడ్డి రాజకీయం
మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ పాగా వేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంపై దృష్టి సారించిన జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల వారీగా కీలక నాయకులను పిలిచి, నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ఎమ్మెల్యే హయాంలో కుంటుపడిన నేపథ్యంలో, ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలన్న ఆలోచనలో ఉన్నారు.

గత ముందస్తు ఎన్నికల తర్వాత నల్గొండ జిల్లాలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు
యుద్ధ ప్రాతిపదికన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, మండలాల వారీగా ఇతర పార్టీల నుండి బలమైన నాయకులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయాలని జగదీశ్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేయగా, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి, నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి.

నాగార్జునసాగర్, హుజూర్ నగర్ టిఆర్ఎస్ ఖాతాలో.. చక్రం తిప్పిన జిల్లా మంత్రి
అయితే ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ జగదీశ్ రెడ్డి చక్రం తిప్పారు. నాగార్జునసాగర్, హుజూర్ నగర్ టిఆర్ఎస్ ఖాతాలో పడేలా చేయడంలో మంత్రి జగదీశ్ రెడ్డి సక్సెస్ అయ్యారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ, అక్కడ టిఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. ఇక ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉండటంతో, గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో, మళ్లీ టీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో కూడా విజయం సాధిస్తుందా? అన్న చర్చ జరుగుతుంది.

మంత్రి జగదీశ్ రెడ్డి సామర్థ్యానికి ఈ ఉప ఎన్నిక పరీక్ష
మంత్రి జగదీశ్ రెడ్డి సామర్థ్యానికి ఈ ఉప ఎన్నిక పరీక్ష అని పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం కోసం బిజెపి, కాంగ్రెస్ లు బలంగా తలపడితే టిఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరుగుతుంది అన్న చర్చ జరుగుతుంది. మంత్రి జగదీశ్ రెడ్డి ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని విజయం సాధించేలా చేస్తే సీఎం కేసీఆర్ వద్ద ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్ నల్గొండ జిల్లా రాజకీయాలపై ప్రభావం
సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటించి, ఆయన సూచనల మేరకు పనిచేయడంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఎప్పుడూ సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ ఉప ఎన్నికను కూడా టిఆర్ఎస్ ఖాతాలో వేయడానికి ఆయన సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుంటూ పావులు కదుపుతున్నారు. ఏదేమైనా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి సామర్థ్యానికి ఈ ఉప ఎన్నిక పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఈ ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్ నల్గొండ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.












Click it and Unblock the Notifications