దిగ్గజం శరత్ కుమార్ను మట్టికరిపించిన తెలుగోడు: ఎవరీ విశాల్?
హైదరాబాద్: నడిగర్ సంఘం. ఇది దక్షిణ భారత సినీ నటుల సంఘం. కానీ ఆధిపత్యం మొత్తం తమిళ సినీ స్టార్లదే. అలాంటి చోటు తమిళుడు కానీ ఓ వ్యక్తి శరత్ కుమార్ వంటి దిగ్గజాన్ని ఢీకొని విజయం సాధించడం గొప్ప విషయమే. పదేళ్ల పాటు ఆ సంఘంలో శరత్ కుమార్దే ఆధిపత్యం. అయితే, విశాల్ ఆ ఆధిపత్యాన్ని ఎదిరించి విజయం సాధించాడు.
విశాల్కు మద్దతు పలికినవారిలో రహస్య మిత్రులు చాలా మంది ఉన్నారు. ఓటుకు గ్యారంటీ ఇచ్చారు. కొందరు యువ సభ్యులు తెగించి ముందుకు వచ్చారు. అయితే, ఎన్నికల్లో శరత్ కుమార్, ఆయన భార్య రాధిక తమిళ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. విశాల్ తెలుగువాడని గుర్తు చేస్తూ ఆయన కులం పేరును కూడా రాధిక ప్రస్తావిస్తూ ప్రచారం సాగించారు.
పదేళ్ల పాటు నడిగర్ అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ విశాల్ ప్యానెల్లోని నాజర్ చేతిలో ఓడిపోయారు. విశాల్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. విశాల్ రాధా రవిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. శరత్ కుమార్ కూతురు, నటి వరలక్ష్మికి, విశాల్కు మధ్య ప్రేమాయణం నడిచినట్లు కూడా గతంలో ప్రచారం సాగింది. అయితే, పెళ్లికి శరత్ కుమార్ కుటుంబం అంగీకరించలేదని, అందుకే విశాల్ శరత్ కుమార్కు వ్యతిరేకంగా పోటీకి దిగారనే ప్రచారం కూడా సాగింది. ఆ విషయం ఎలా ఉన్నా విశాల్ తీవ్రమైన కృషి, పట్టుదలతో శరత్ కుమార్ వర్గాన్ని ఎదుర్కున్నారు.
దాదాపు రెండేళ్ల నుంచి అతను అందుకు కృషి చేస్తూ వచ్చారు. దక్షిణ భారతదేశమంతా పర్యటించారు. చిన్న నటులు, యువత నుంచి విశాల్కు విశేషమైన మద్దతు లభించింది. శరత్ కుమార్పై పేరుకుపోయిన అసంతృప్తి, తన తెగింపుతో విశాల్ విజయం సాధించారు.
విశాల్ తెలుగువాడైనా తమిళ సినిమాల్లోనే హీరోగా ఎదిగాడు. చెల్లేమ్మే సినిమాతో అతను తమిళ సినీ రంగంలో అడుగు పెట్టారు. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణా రెడ్డి. ఆయన తల్లిదండ్రులు జానకీదేవి, జికె రెడ్డి. చెన్నైలో స్థిరపడిన జికె రెడ్డి తమిళ, తెలుగు సినిమాలను నిర్మించారు. అన్న విక్రమ్ కృష్ణ విశాల్ నటించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. విశాల్ బాల్యంలో హైదరాబాదులోని దిల్షుర్నగర్ పబ్లిక్ స్కూల్లో చదివాడని చెబుతారు.
విశాల్ సెకండరీ ఎడ్యుకేషన్ను చెన్నైలోని డాన్ బోస్కో మెట్రిక్యులేన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత లయోలా కాలేజీ నుంచి విజ్యువల్ మీడియాలో డిగ్రీ చేశారు.