అటు జగన్, ఇటు కెటిఆర్: బాబు రిస్క్ చేశారా, నారా లోకేష్ ఎదుర్కోగలరా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీలో అత్యంత కీలకమైన నేతగా మారినప్పటికీ, తండ్రి తర్వాత ఆయనదే నిర్ణయాత్మక పాత్ర అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోగలరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బాధ్యతల భారాన్ని నారా లోకేష్ భుజాలపై మోపడం ద్వారా చంద్రబాబు నాయుడు రిస్క్ చేశారని అంటున్నారు. ధీటైన నాయకుడని అనిపించుకోవడానికి సులువైన లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ ముందు పెట్టాల్సి ఉండిందని అంటున్నారు. అతి కష్టమైన లక్ష్యాన్ని సాధించే బాధ్యతను పెట్టి నారా లోకేష్ భవిష్యత్తును చిక్కుల్లో పడేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా, ఆయనకు ధీటైన నాయకుడిగా నారా లోకేష్ను చూపించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వారసుడు నారా లోకేష్ అనే విషయంలో మరో మాట లేకపోవచ్చు గానీ 2019లో వైయస్ జగన్ను ఎదుర్కునే సత్తా నారా లోకేష్కు ఉందా అనే ప్రశ్న గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల వల్ల ఉత్పన్నమవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కెటి రామారావుకు ప్రత్యర్థిగా నారా లోకేష్ను చూపించారు. అయితే, ఏ విషయంలోనూ నారా లోకేష్ కెటిఆర్కు సమాన స్థాయిలో నిలబడలేదని ఫలితాలు రుజువు చేస్తుండడమే కాకుండా సర్వేలో కూడా ఆ విషయం వెల్లడైంది. అయితే, గ్రేటర్ హైదరాబాదులో టిఆర్ఎస్ గెలవడానికి లోకేష్ గానీ, ఆయనకు అనుకూలమైన మీడియా గానీ ఇతరేతర కారణాలను చూపిస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణలో టిడిపి నానాటికీ తీసికట్టుగా తయారవుతోందని ఎవరిని అడిగినా చెబుతారు.
ఈ పరిస్థితిలో నారా లోకేష్ తన రాజకీయాలకు వేదికగా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకుంటారా, ఇటు తెలంగాణను ఎంచుకుంటారా అనేది తేల్చుకోవాల్సి ఉందని అంటున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన రెండు ప్రాంతాల్లో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుందనేది కాదనలేని విషయమే అయినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఏదో ఒక రాష్ట్రాన్ని ప్రధానం చేసుకోవాలని అంటున్నారు. వైయస్ జగన్ తెలివిగా వ్యవహరించి తెలంగాణను వదులుకోవడంలోని వ్యూహం అదేనని అంటున్నారు.