నయీం ఎన్కౌంటర్కు వ్యతిరేకం కాదు: జడ్జితో విచారణ అన్న నారాయణ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో రాజకీయ నాయకులు, అధికారుల సంబంధాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ నక్సలైట్లను ఏరివేసేందుకు ప్రభుత్వాలే నయీంను పెంచిపోషించాయని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్న కారణంతో నయీంను పోలీసులు అంతమొందించారని ఆయన ఆరోపించారు. అలా లేని పక్షంలో నయీంకు ఎలాంటి ఇబ్బంది కలిగి ఉండేది కాదని ఆయన అన్నారు. కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్కు తాము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.
అయితే నయీం డైరీల్లో దొరికిన సమాచారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు జరపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింతగా కృషి చేయాలని ఆయన సూచించారు. జీఎస్టీ బిల్లు పార్లమెంట్లో ఆమెదానికి కేంద్రం మంత్రి వెంకయ్య చూపిన శ్రద్ధ ఏపీకి హోదా ఇప్పించడంపై చూపిస్తే బాగుండేదని ఆయన అన్నారు.
దేశంలో గో సంరక్షణ సమితులు... దళిత భక్షక సమితులుగా మారాయని ఆయన దుయ్యబట్టారు. ఏపీకి హోదా మద్దతు తెలిపిన పార్టీలతో కలిసి ఉద్యమం చేసి కేందంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకురవాడం లేదని ఆయన ప్రశ్నించారు. హోదాపై తామంతా పోరాటానికి కలిసి వస్తుంటే జగన్ ఒంటరిగా బంద్కు పిలుపు ఇవ్వడంలో దాగిఉన్న పరమార్థం అర్ధం కాలేదని ఆయన చెప్పారు.