కెసిఆర్ అబద్ధాలను నమ్ముతారు, బాబు నిజం చెప్పినా..: జగన్, మోడీపై నారాయణ
హైదరాబాద్: తమ పార్టీ కాలం చెల్లిందన్న వారికే కాలం చెల్లిందని అంటున్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. పార్టీ ఉనికి అంటే ఓట్లు.. సీట్లే కాదని అన్నారు. ఓ మీడియా ఛానల్తో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా ఆయన విరుచుకుపడ్డారు.
నరేంద్ర మోడీ ప్రధాని కన్నా వ్యక్తిగానే ఎక్కువ కీర్తిస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల పోకడ నియంత్ర ధోరణిలో ఉంటోందని ఆరోపించారు. వామపక్ష భావజాలం నేటి యువత అర్థం చేసుకుంటోందని చెప్పారు. కామ్రేడ్లు అంటే కమ్మ, రెడ్లు అనే వాదన తప్పని అన్నారు. వామపక్షాలు ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాయని చెప్పారు. అవసరమైనప్పడు వామపక్షాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
తెలంగాణ సీఎం చెప్పేవన్నీ అబద్ధాలేనన్న నారాయణ.. ఆయన అబద్ధాలు చెప్పినా నమ్ముతారని అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాలు చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తాను చేసే సవాళ్లను స్పోర్టివ్ గా తీసుకోవాలని అన్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిస్తే చెవి కోసుకుంటానని చెప్పిన ఆయన.. దానిపై ఈ విధంగా స్పందించారు.
దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని అన్నారు. కెసిఆర్ 12ఏళ్లపాటు ఉద్యమం కొనసాగించారని, తెలంగాణ ఉద్యమ పేటెంట్ ఆయనకే దక్కిందని నారాయణ చెప్పారు.
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేయాలని కెసిఆర్ చూస్తుంటే.. ఏపీలో చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. రాజీనామా చేయించకుండా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం తప్పని చెప్పారు. ఈ విషయంలో కెసిఆర్, చంద్రబాబు, ఇరు రాష్ట్రాల స్పీకర్లు తప్పుడు వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు.
అయితే, ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా వ్యవహరించడం లేదని అన్నారు. అందువల్లే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు.
కేంద్రంలో నియంతృత్వ దోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. జేఎన్యూ, హెచ్సియూ ఘటనలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయని అన్నారు. పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అబ్ధాలు చెప్పారని అన్నారు. తాము బిజెపికి వ్యతిరేక కాదని చెప్పిన నారాయణ.. వారి ఏకపక్ష దోరణికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్రం ఆర్ఎస్ఎస్ సూచనలతో నడుస్తోందని ఆరోపించారు. కేంద్రం కార్పొరేట్ ప్రభుత్వంగా మారిపోయిందని ఆరోపించారు.