మోడీ ఏం సంకేతాలిస్తున్నట్టు?: ఇక్కడి బీజేపీని ముంచడానికేనా!..
ఇప్పుడు సమస్యంతా కేంద్రానికి-ఏపీకి మధ్య. చేద్దాం.. చూద్దాం.. కాకుండా ఏదైనా చేసి చూపించండనేది టీడీపీ ఎంపీల డిమాండ్. కానీ మోడీ మాత్రం దీన్ని మరోలా దాటవేసేందుకు ప్రయత్నించాడు. మధ్యలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి స్పీచ్ గట్టిగానే దంచి కొట్టాడు. కానీ ఏం ప్రయోజనం?.. అసందర్భంగా పాత విషయాలేవో ముందటపడేసి అనవసరంగా అభాసుపాలయ్యాడన్న విమర్శే మిగిలిపోయింది. దానికిప్పుడు తెలంగాణ బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు..
Recommended Video
ఎందుకిదంతా?:
ఏపీకి ఏం చేస్తామో సూటిగా చెప్పకుండా.. ఎన్టీఆర్ను కీర్తించడం ద్వారానో.. కాంగ్రెస్ను కడిగిపారేయడం ద్వారానో మోడీ ఏం సంకేతాలిస్తున్నట్టు?. ఓవైపు రాష్ట్ర ప్రయోజనాల గురించి తేల్చండి అని నిలదీస్తుంటే.. మోడీ మాత్రం ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం ప్రాసంగికత లేని వెనుకటి సంగతుల గురించి చెప్పి పూర్తిగా ఒక అసందర్భ ఉపన్యాసం కానిచ్చేశారు.
మోడీ ఏమన్నారు?:
అప్పట్లో రాజీవ్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు దళిత ముఖ్యమంత్రిని అవమానించారని ఓ వ్యాఖ్య చేశారు. ఒక సీఎంను అవమానించారన్న ఆక్రోశంతోనే ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఈ రెండు విషయాలు ఏమాత్రం పొంతన లేనివే. అసలు అంజయ్య దళితుడే కాదన్నది కూడా మోడీ గ్రహించలేకపోవడం విడ్డూరం. సరే, ఇవన్నీ చెప్పి.. కొత్తగా మళ్లీ కాంగ్రెస్ పైన విమర్శలు చేసి మోడీ ఏం సాధించినట్టు?
దాటవేత ధోరణి:
ఏపీ ప్రయోజనాలపై సూటిగా సమాధానం చెప్పలేకనే మోడీ దాటవేత ధోరణి ప్రసంగాన్ని కొనసాగించినట్టు స్పష్టంగా అర్థమైపోతున్నది. మరోవైపు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించారన్న వ్యాఖ్యలు మోడీపై తెలంగాణలో ప్రతికూలతను ఏర్పరిచేవే తప్ప మరొకటికాదు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇక్కడి తెలంగాణ బీజేపీ నేతలను ఒకవిధంగా మోడీ ఇరుకునపడేసినట్టే.
బీజేపీకే నష్టం?:
అసలే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మోడీ తెలంగాణపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ఇక్కడి బీజేపీని కలవరపెట్టేదే. గత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిచిన బీజేపీకి ఇప్పుడు ఆ కాస్త కూడా దక్కకుండా చేస్తారా ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసి.. ఇప్పుడు విభజన విషయంలోనూ తెలంగాణ ప్రజల సెంటిమెంటును దెబ్బకొట్టేలా మోడీ మాట్లాడటం ఆ పార్టీకే నష్టం అంటున్నారు.
తేల్చుకోవాల్సిందే..:
టీడీపీతో సఖ్యత కావాలంటే ఏపీ ప్రయోజనాల విషయంలో మోడీ ఏదో ఒకటి తేల్చుకోవాలి. అంతే కానీ అన్నింటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కారణమన్నట్టుగా ఆయన మాట్లాడితే.. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ విషయంలో కచ్చితత్వంతోనే వ్యవహరిస్తారన్న సంగతి మరిచిపోవద్దు.