కేసీఆర్కి ట్విట్టర్లో ప్రధాని అభినందన: చంద్రబాబు 22 సార్లు కలిసినా?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరధ పథకం పట్ల ప్రధాని నరేంద్రమోడీ కూడా ముగ్ధులయ్యారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన ద్వారా ఆయనకు కాస్తంత ఎక్కువ ప్రధాన్యత లభించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కేసీఆర్ తన ఢిల్లీ పర్యనటలో భాగంగా సుమారు గంటన్నర పాటు ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూలంకుషంగా మోడీకి కేసీఆర్ వివరించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా వివరాలను వెల్లడిస్తే, ప్రధాని మోడీ ట్వీట్ల ద్వారా కేసీఆర్ తనకు చెప్పిన వివరాలతో పాటు తెలంగాణ సాధిస్తున్న పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పారు.
ప్రధాని మోడీ ట్వీట్ల ద్వారా సీఎం కేసీఆర్పై ఒకింత ప్రశంసలు కురిపించారనే చెప్పొచ్చు. చక్కని పరిపాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని, ముఖ్యంగా మిషన్ భగీరధ పథకం పట్ల ప్రధాని కూడా కాస్తంత ఆసక్తిని కనబర్చినట్లు అనిపిస్తోంది.

అయితే ప్రధాని మోడీ ట్వీట్ల రూపంలో సీఎం కేసీఆర్ను అభినందించడం తెలుగు దేశం పార్టీ వర్గాలకు నచ్చడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ పురగోతిపై పలుమార్లు ప్రధానిని కలిసి వివరించినా ఒక్కసారి కూడా ఆయన ట్వీట్ చేయక పోవడం విశేషం.
చంద్రబాబు సైతం ఏపీ సమస్యలు, పురోగతిపై ఇప్పటి వరకు 22 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో పాటు ప్రధానిని కలిసి వచ్చానని పలు సందర్భాల్లో చెప్పారు. దేశంలో మరే ఇతర సీఎం కూడా వెళ్లనన్ని సార్లు తాను ఢిల్లీ వెళ్లి అందరితో భేటీ అయి రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడుతున్నానని ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటారు.
సాధ్యమైనంత వరకు ప్రతిసారీ ప్రధానిని కూడా కలిసి రాష్ట్రంలో సాధిస్తున్న పురోగతితో పాటు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతితో పాటు ఇతర సంక్షేమ పథకాల విషయంలో ఆయనతో మాట్లాడి ఉండొచ్చు. అయితే ప్రధాని స్పందన ఎలా ఉందన్న విషయం సామాన్యులకు తెలియదు.

కానీ కేసీఆర్ ఇలా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో సమావేశం అయ్యారో లేదో ఆ వెంటనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు వివరించి చెప్పారంటూ ప్రధానమంత్రి ట్వీట్లో పేర్కొనడాన్ని టీఆర్ఎస్ వర్గాలు గొప్పగానే చెప్పుకుంటున్నాయి.
నిజానికి వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు రాజధాని దగ్గరి నుంచి, పట్టిసీమ వరకు ఏపీలో చేపడుుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మోడీకి వివరిస్తూనే ఉన్నారని పాలనలో చంద్రబాబుతో పోలిస్తే కేసీఆరే ఒక అడుగు ముందున్నారని తాజా ట్వీట్లే చెబుతున్నాయని సంతోషపడుతున్నారు.
అంతేకాదు ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుతో పోలిస్తే, కేసీఆర్ పాలన కూడా కాస్తంత మెరుగ్గా ఉండటంతోనే ప్రధాని మోడీ ఆయన్ను మెచ్చుకున్నారని వాదన కూడ తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు అమరావతి, పట్టిసీమ లేదా పోలవరం వంటి వాటి విషయంలో ఎప్పటికప్పుడు తనకు వివరాలు తెలుస్తున్నా వాటి గురించి కామెంట్ చేయడం మోడీకి ఇష్టం లేకనే ట్వీట్ చేయలేదని టీడీపీ నేతలు కవర్ చేస్తున్నారు.
CM KCR also briefed me on Mission Bhagiratha, which aims to provide safe drinking water to rural households. https://t.co/9iDPGs1z1q
— Narendra Modi (@narendramodi) 10 May 2016
Details on Mission Kakatiya, to rejuvenate water tanks & waters storage structures & progress in micro-irrigation were shared by KCR Garu.
— Narendra Modi (@narendramodi) 10 May 2016
KCR Garu and I met & extensively reviewed the drought & water scarcity situation in Telangana. @TelanganaCMO pic.twitter.com/TWTM0zFoSH
— Narendra Modi (@narendramodi) 10 May 2016












Click it and Unblock the Notifications