నయీం ఆస్తుల లెక్క తేల్చిన సిట్: 7 టెరాబైట్ల సమాచారం, 250 ఖాతాలు, భార్యకు గుట్టు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అక్రమాస్తుల చిట్టాను సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తేల్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నయీంకు రూ.14.39 కోట్ల ఆస్తులు గుర్తించారు. 1015 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లుగా సిట్ గుర్తించింది. అలాగే, 1,67,117 చ.అ.ల ఇళ్ల స్థలాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నయీం వద్ద 7 టెరా బైట్ల సమాచారం ఉందని తెలుస్తోంది.
అంతేకాదు, 20కి పైగా భవనాలున్నాయి. ఎక్కువగా నల్గొండ, మహబూబ్నగర్, జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్లోనూ ఈ భూములు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇళ్ల స్థలాలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ఖరీదైన ప్రాంతాలోనివే.
అనుచరులను కూడా ఎక్కువగా నమ్మని నయీం ఆస్తులను భార్య, సోదరి, సమీప బంధువుల పేరిటే ఆస్తులను ఉంచాడు. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అధికారులనే తన డెన్లకు పిలిపించి భూముల బదలాయింపు చేసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు గోవాలో మొత్తం 20 భవనాలను సిట్ గుర్తించింది. వీటిని నయీం తన డెన్లుగా వాడుకున్నాడు. మరోవైపు సోదాల్లో రూ.2.08కోట్ల నగదు, 2.14కిలోల బంగారం లభించింది.
నయీం, అతని కుటుంబ సభ్యులు, అనుచరులకు సుమారు 250 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. కానీ ఆ ఖాతాల్లో సొమ్ము నామమాత్రంగానే ఉంది. కాబట్టి భారీగా నగదు, బంగారాన్ని మావోయిస్టుల తరహాలో ఎక్కడో డంప్ రూపంలో దాచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నయీం భార్య, సోదరికి వీటి గురించి తెలిసి ఉండవచ్చునని భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలోని కోర్టుకు నయీం అనుచరులు
నయీం అనుచరులు రమేష్, గోపిలను పోలీసులు బుధవారం నాడు కరీంనగర్ జిల్లా జగిత్యాల కోర్టు ఎదుట హాజరుపరిచారు. బీడీ వ్యాపారిని బెదిరించిన కేసులో పలు సెక్షన్ల కింద వారి పైన కేసులు నమోదయ్యాయి.
రమేష్ నుంచి కారు, పిస్టోల్, రూ.లక్ష, స్టాంప్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపి నుంచి తపంచా, ఐఫోన్, రూ.52వేలు, స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాఫ్తు అధికారులు నల్గొండ జిల్లాలోని లక్ష్మీనర్సింహ వెంచర్ను బుదవారం నాడు పరిశీలించారు. ఇక్కడ నయీం అనుచరుడు 1650 ప్లాట్లను కబ్జా చేసినట్లుగా గుర్తించారు.
కస్టడీకి నయీం ఫ్యామిలీ
హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు నయీం కుటుంబ సభ్యులను తమ కస్టడీకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, సోదరి సలీమా బేగం, బావమరిది మతీన్, మరో మహిళ బేగంను పోలీసులు షాద్ నగర్లో ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుంచటి అప్సానా, ఫర్జానాలను పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు.