నయీం కేసు: అనుచరులకు జైలులో రాచమర్యాదలు, అధికారులకు నోటీసులు
లంచం తీసుకుని గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులకు జైలులో రాచమర్యాదలు చేశారన్న ఆరోపణపై మరికొంతమంది జైలు అధికారులకు బుధవారం మెమోలు జారీ అయ్యాయి.
హైదరాబాద్: లంచం తీసుకుని గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులకు జైలులో రాచమర్యాదలు చేశారన్న ఆరోపణపై మరికొంతమంది జైలు అధికారులకు బుధవారం మెమోలు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే జైలర్ గోపిరెడ్డి సస్పెన్షన్ కి గురవగా, ఇప్పుడు తాజాగా ఇందుకు సహకరించిన ఇతర అధికారులపై కూడా చర్య తీసుకున్నట్లయింది.
వరంగల్ కేంద్ర కారాగారంలో నయీం అనుచరులు పాశం శీను, సుధాకర్ దగ్గర ముడుపులు పుచ్చుకుని జైలర్ గోపిరెడ్డి ఇతర అధికారులు వారికి రాచమర్యాదలు చేసినట్లు నిర్ధారణ అయింది. గ్యాంగ్ స్టర్ నయీం కేసును సీరియస్ గా తీసుకున్నామని సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మంది అధికారులకు మెమోలు జారీ చేశారు. దీంతో ఇతర అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.