ఇవాంక అడిగితే ఏం చెప్తారు: కెసిఆర్ ఆమె సూటి ప్రశ్న
హైదరాబాద్: మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఎందుకు కల్పించలేదని అమెరికా అధ్యక్షురాలి కూతురు ఇవాంక అడిగితే ఏమని సమాధానం చెబుతారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు.
మహిళా సంక్షేమం గురించి గొప్పగా చెప్పే కెసిఆర్ మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. టిఆర్ఎస్ తరఫున ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో నోరు మెదపక పోవడాన్ని ఆమె తప్పు పట్టారు.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే లోక్సభలో బిల్లు ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. లోక్సభలో బిల్లు పాసైన తర్వాత రాజ్యసభలో తమ పార్టీకి బలం ఉన్నందున తప్పని సరిగా మద్ధతునిస్తుందని చెప్పారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే విధంగా తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఆమె తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్కు వస్తున్నందున తాము ఇదివరకే అప్పాయింట్మెంట్ అడిగామని, కానీ ఇంత వరకు స్పందించలేదని ఆమె చెప్పారు. అమెరికా అధ్యక్షుడి కూతురు అయితేనే అప్పాయింట్మెంట్ ఇస్తారా? అని ఆమె అడిగారు. ముఖ్యమంత్రి కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు. అందరూ ఇవాంక, కెసిఆర్ తనయురాలు కవిత కాలేరు కదా అని శారద అన్నారు.