జయరాం హత్య కేసులో ట్విస్ట్: శిఖాచౌదరి పాత్ర.. జూబ్లీహిల్స్ పోలీస్లు మళ్లీ దర్యాఫ్తు చేస్తారా?
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా విచారణలో తేలిందని నందిగామ పోలీసులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జయరాం సతీమణి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?
హైదరాబాదులో ఫిర్యాదు
జయరాం భార్య పద్మిని... శిఖా చౌదరి పైన హైదరాబాదులోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు, విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే హైదరాబాదులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాకేష్ రెడ్డితో పాటు మరికొందరి హస్తముందని ఆమె చెబుతున్నారు. జయరాం మేనకోడలు శిఖాచౌదరి ప్రోద్బలంతోనే హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. నందిగామ పోలీసుల దర్యాప్తుపై సంతృప్తి చెందని పద్మశ్రీ.. న్యాయవాదులు, బంధువులతో కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు మళ్లీ కొత్తగా ఈ కేసును దర్యాప్తు చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భర్త హత్యపై న్యాయపోరాటం
జయరాం హత్య కేసులో శిఖాచౌదరి ప్రమేయం ఉందని పద్మశ్రీ ఆరోపణలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. శిఖా ప్రమేయం లేకుండా తన భర్త హత్య జరిగి ఉండదని ఆమె గట్టిగా చెబుతున్నారు. ఈ కేసులో శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇస్తే తాను న్యాయ పోరాటం చేస్తానని గతంలోనే చెప్పారు. ఈ మేరకు ప్రస్తుతం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. 2016లోనే తన భర్త హత్యకు బంధువులే కుట్ర చేస్తున్నారని చెప్పారని చెప్పారు.
శిఖా చౌదరికి గత కొన్నాళ్లుగా రాకేష్తో సంబంధం లేదు
జయరాం హత్య కేసుపై నందిగామ పోలీసులు ఈ రోజు మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. శిఖా చౌదరికి సంబంధం లేదని ప్రాథమికంగా తేలిందని చెప్పారు. గత కొద్దికాలంగా శిఖా చౌదరికి, రాకేష్కు సంబంధం లేదని చెప్పారు. అంతకుముందు వీరి మధ్య సంబంధాలు కొనసాగాయన్నారు. శిఖా చౌదరి జోక్యంపై మీడియా ప్రతినిధులు పదేపదే పోలీసులను ప్రశ్నించారు. నిందితుడి వాంగ్మూలం మేరకే పరిమితమయ్యారని, పూర్తి దర్యాఫ్తు వివరాలు చెప్పలేదన్నారు. దర్యాఫ్తు, సాక్ష్యాధారుల ద్వారా తేలిన నిజాలు బయటపెట్టాలని మీడియా అడిగింది. రాకేష్ నుంచి జయరాం తీసుకున్న అప్పు, వడ్డీ కలిపి రూ.6 కోట్లు అయిందని, డబ్బు సకాలంలో చెల్లించకపోవడం వల్లే రాకేష్ కోపంతో హత్య చేశాడని, రీనా పేరుతో వాట్సాప్ చాట్ చేసి జయరాంను ఇంటికి పిలిపించుకున్నాడని, డబ్బు కోసం రాత్రంతా గొడవ పడ్డారని, ఆ తర్వాత జరిగిన గొడవలో జయరాం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.