కొత్త ఎమ్మెల్సీ వాణిదేవి కారుకు ప్రమాదం -అసెంబ్లీ వద్ద అనూహ్య ఘటన - తప్పిన ముప్పు
బడ్జెట్ సమావేశాలు కొనసాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ వద్ద గురువారం ఉదయం అనూహ్య సంఘటన జరిగింది. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎమ్మెల్సీ కారులో లేకపోవడం, కారును నడిపిన వ్యక్తికి కూడా పెద్దగా గాయపడకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
హైదరాబబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి గెలుపొందిన వాణిదేవి ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు ప్రాగణానికి వచ్చిన ఆమె.. కారు దిగి లోపలికి వెళ్లగా, డ్రైవర్ కారును 8వ నంబర్ పార్కింగ్ ప్లేస్లో నిలిపాడు. కాసేపటి తర్వాత..
కారును అక్కడి నుంచి పక్కకు తీయాల్సి రావడం, డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న గన్మెన్ ఒకరు కారును నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బ్రేక్కి బదులు యాక్సిలేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పి విధుల్లో ఉన్న పోలీసులపైకి దూసుకెళ్లింది. వారంతా అప్రమత్తమై తప్పించుకోగా కారు పార్కింగ్ గేటును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
కొత్త ఎమ్మెల్సీ వాణిదేవి కారుకు ప్రమాదం ఘటన కాసేపు అసెంబ్లీ ఆవరణలో కలకలం రేపింది. కారు గేటును ఢీకొట్టిన సమయంలో భారీ శబ్ధం రావడంతో అక్కడున్నవారు కంగారు పడ్డారు. కారును పక్కకు పెట్టే ప్రయత్నం చేసిన గన్మెన్కు డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై తప్పించుకోకపోతే ప్రాణనష్టం జరిగేదని తెలిపారు.