ఈజీ మనీ కోసం డ్రగ్స్ రవాణా: హైదరాబాద్లో నైజీరియన్ అరెస్టు
హైదరాబాద్: ఈజీ మనీతో జల్సాలకు అలవాటుపడ్డ ఓ నైజీరియన్ ఇందుకోసం 'డ్రగ్స్' మార్గాన్ని ఎంచుకున్నాడు. డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే పోలీసుల తనిఖీల్లో ఎట్టకేలకు పట్టుబడి కటకటాలపాలయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం.. పాట్రిక్ విలియమ్స్ ఒజొన్న అనే నైజీరియన్ విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చాడు. రంగారెడ్డిలోని సన్ సిటీలో నివాసముంటున్న ఇతనికి ఓ పబ్ లో కెన్యాకు చెందిన డేవిస్ క్రిస్ రిచర్డ్ అలియాస్ కొల్లిన్స్ తో పరిచయం ఏర్పడింది.
కొల్లిన్స్ అప్పటికే అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. అతన్ని చూసి విలియమ్స్ కూడా డ్రగ్స్ అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కొల్లిన్స్ వద్దే తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి అమ్ముతూ వస్తున్నాడు. కొల్లిన్స్ వద్ద ఒక గ్రాము మత్తు పదార్థాన్ని రూ.2వేలకు కొనుగోలు చేసే విలియమ్స్.. బయటి వ్యక్తులకు దాన్ని రూ.5వేల నుంచి రూ.6వేల వరకు అమ్ముతున్నాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో అటుగా వెళ్తున్న విలియమ్స్ ను చూసి పోలీసులు అనుమానపడ్డారు. ఆ తర్వాత అతని ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అతని వద్ద 15గ్రాముల మత్తు పదార్థం లభించింది. వెంటనే పోలీసులు విలియమ్స్ ను అదుపులోకి తీసుకుని, డ్రగ్ తో సహా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మరో నిందితుడు కొల్లిన్స్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.